Thursday, May 21, 2020

ఉధ్దవేష్ బువా –5వ భాగమ్


     SSST

  Rose PNG HD Transparent Rose HD.PNG Images. | PlusPNG

21.05.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
రోజు సాయిభక్తులలో ఒకరయిన శ్రీ ఉద్ధవేష్ బువా అనబడే శ్యామ్ దాస్ బాబా గురించి అయిదవ భాగం మీకు అందిస్తున్నాను.  ఆయనయొక్క సమాచారం shridisaitrust.org – Chennai వారి నుండి గ్రహింపబడింది.
తెలుగు అనువాదమ్  : ఆత్రేయపురపు త్యాగరాజు
                            నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ నం.  9440375411 & 8143626744
ఉధ్దవేష్ బువా –5వ భాగమ్
అదే సమయంలో వారు క్రిందకు చూసేటప్పటికి ఒక గోసాయి పెద్ద కుండతో నీళ్ళు మోసుకుంటూ వారివైపే వస్తున్నాడు.  ఆగోసావి వీరి దగ్గరకు వచ్చి తారాబాయిని ఉద్దేశించి.”అమ్మా, ఇతనికి ఈ మంచినీళ్ళు ఇవ్వు.  కాసిని నీళ్ళు తలమీద, ముఖం మీద చల్లు.  తెలివివచ్చి లేచి కూర్చుంటాడు” అని చెప్పాడు.  ఈవిధంగా చెబుతూ ఆనీళ్ళకుండని ఆమెకి ఇచ్చాడు.  ఆ గోసావి ఇంకా ఇలా చెప్పాడు. “ఇందులోని నీళ్ళన్నీ అతనిచేత తాగించు.  నాకింకా కాస్త పని ఉంది వెళ్ళాలి.  మీరు తిరిగి వచ్చేటపుడు నేను మిమ్మల్ని కలుస్తాను” అని చెప్పి ఆ గోసావి మెట్లు ఎక్కి పైకి వెళ్ళసాగాడు.  అందరూ గోసావి చెప్పినట్లే అతని చేత నీళ్ళు త్రాగించారు.  ఉధ్ధవేష్ మెల్లిగా కోలుకోవడం జరిగింది.



తేరుకున్నతరువాత ఉధ్ధవేష్ పైకి చూసాడు.  గోసావి దాదాపు 20 మెట్లదాకా పైకి ఎక్కి ఆతరువాత అదృశ్యమయ్యాడు.  ఉధ్దవేష్ పూర్తిగా కోలుకోవడానికి ఒక గంట సమయం పట్టింది.  ఆతరువాత అందరూ మళ్ళీ  మెట్లు ఎక్కడం మొదలుపెట్టారు.  పైన అందరికీ అన్ని దేవాలయాలలోను మంచి దర్శనం కలిగింది.  ఈ సమయంలోనే అందరు చర్చించుకోసాగారు.  “వచ్చిన ఆ గోసావి ఎవరు?  అతను ఉధ్ధవేష్ కోసం నీళ్ళు ఎక్కడినుంచి, ఎందుకని తీసుకుని వచ్చాడు? ఏవిధంగా చేయాలో అన్నీ చక్కగా వివరించాడు” ఈ విధంగా అందరూ మాట్లడుకోసాగారు.  కాని, ఉధ్ధవేష్ కి తెలుసు.  గోసావి రూపంలో బాబాయే వచ్చి తనను కాపాడారని.  తాను మొదట్లో షిరిడీకి వచ్చిన సమయాలలోనే చెప్పారు బాబా “నేనెప్పుడూ నీవెనుక, నీముందు ఎల్లవేళలా ఉంటాను” అని.  షిరిడీ ఎక్కడ? గిర్నార్ ఎక్కడ? ఎంతదూరమయినా సరే బాబా తన బిడ్డలకు రక్షణగా ప్రక్కనే ఉంటారు.  ఆ తరువాత కొండదిగి వస్తున్నపుడు తాను అంతకు ముందు పడిపోయిన చోటుకు చేరుకోగానే ఆ గోసావి మరలా వస్తాడేమోనని కాసేపు ఎదురు చూద్దామని అనుకున్నాడు.

సరిగా ఆప్రదేశానికి చేరుకోగానే ఉధ్ధవేష్ గోసావి కోసం గంటసేపు ఎదురుచూసాడు.  కాని మిగిలినవారంతా ఇక క్రిందకు దిగి వెళ్ళిపోదామని ప్రాధేయపడ్డారు.  ఇప్పటికే సాయత్రం 5 గంటలయింది.  ఇక తొందరగానే చీకటిపడుతుంది అన్నారు.  అప్పటికే అందరూ అలసిపోయి ఆకలితో ఉన్నారు.  అయిష్టంగానే ఉధ్ధవేష్ క్రిందకి దిగడానికి సమ్మతించాడు.  అందరూ కొండ దిగువన జగన్నాధ్ గాగ్ కి చేరుకున్నారు.  అక్కడ బోజనాలు చేసి రాత్రికి అక్కడే బసచేసారు.

కాని, ఉధ్ధవేష్ కి రాత్రంతా నిద్ర పట్టలేదు.  ఆరోజు జరిగినదంతా తలచుకుంటుంటే అతని మనసంతా ఎంతో ఆనందంతో నిండిపోయింది.  తాను పడిపోయినా ఎక్కడా దెబ్బలు తగల్లేదు.  మోకాలు మీద కొన్ని గీరుళ్ళు పడ్డాయి తప్ప మరేమీ కాలేదు.  మానసికంగా ఎటువంటి ఆందోళన తనకి కలుగలేదు.  తనకు ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఉన్నందుకు చాలా సంతోషమనిపిస్తూ ఉంది.  కాని, ఒక్కటె విచారం.  తనను కాపాడిన ఆగోసావిని మరలా కలుసుకోలేకపోయాననే బాధ అతని మనసుని ఆక్రమించి, చాలా అస్థిమితంతా ఉన్నాడు.  ఆ గోసావి మరలా ఎందుకని కనిపించలేదు?  కారణమేమిటి?  జరిగినదంతా మరలా మరలా గుర్తుకు తెచ్చుకుంటున్నాడు.  దుఃఖం ముంచుకొస్తూ ఉంది.  నిద్ర పట్టడంలేదు  ఆరోజు రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు అతనికి కల వచ్చింది.  ఆ కలలో బాబా కనిపించి, “అరే! శ్యామ్ దాస్, ఎందుకు ఏడుస్తున్నావు? అలా ఏడవకు.  నువ్వు చేయవలసిన పని ఎంతో ఉంది.  భవిష్యత్తులో నీకే తెలుస్తుంది.  ఇక లే” అన్నారు.  బాబాగారి ప్రేమపూర్వకమయిన మాటలు తనయందు ఆయన  చూపుతున్న వాత్సల్యం అతనికి ఎంతో ఓదార్పును కలిగించాయి.  కొన్ని నెలల తరువాత అతను షిరిడీకి వచ్చాడు.  ద్వారకామాయిలోకి అడుగుపెట్టగానే బాబా “రావోయి శ్యామ్ దాస్ – నీదాహం తీర్చడానికి నేను చాలా నీళ్ళివ్వలేదా?” అన్నారు.  ఉధ్ధవేష్ బాబా పాదాలమీద తన శిరసునుంచి, కన్నీటితో ఆయన పాదాలకు అభిషేకం చేసాడు.  బాబా అతని శిరసుపై తన చేయిని ఉంచి ఆశీర్వదించి ఆతరువాత ఊదీని ప్రసాదించారు.

ఆఖరిసారి దర్శనం చేసుకోవడానికి ఉధ్ధవేష్ సాయంత్రం 3 గంటలవేళ ద్వారకామాయి మసీదుకు వచ్చాడు.  కొంతమంది భక్తులు సభామండపంలో కూర్చుని ఉన్నారు.  వారంతా ద్వారకామాయికి వెళ్ళవద్దని ఉధ్ధవేష్ ని హెచ్చరించారు.  ఆసమయంలో బాబా తీవ్రమయిన ధ్యాననిష్టలో ఉన్నట్లుగా కదలకుండా కూర్చుని ఉన్నారు.  ఆ సమయంలోనే ఒక భక్తుడు ఆయన దర్శనం కోసం ఆయన దగ్గరకు వెళ్ళాడు.  బాబా తీవ్రమయిన కోపంతో అతడిని తన సటకాతో కొట్టారు.  అతని మీద తిట్లవర్షం కురిపించారు.  ఆభక్తుడు ద్వారకామాయినుండి ఒక్క పరుగు లంకించుకున్నాడు.  ఉధ్ధవేష్ పైకి వెళ్లగానే బాబా ఏమీ జరగనట్లుగానే అతనిని ఆహ్వానించారు.  ఉధ్ధవేష బాబా వద్ద కొంతసేపు కూర్చున్నాడు.  అపుడు బాబా “శ్యామ్ దాస్ మళ్ళీ ఎప్పుడు వచ్చావు?” అన్నారు.  ఉధ్ధవేష్ బాబాతో “ నేను మళ్ళీ తొందరగానే వస్తాను అని చెప్పి ఊదీ తీసుకుని బయలుదేరాడు.  అతను ఇంకా సభామండపం ద్వారం దగ్గరకు చేరుకోకుండానే బాబా అతనిని వనక్కి రమ్మని పిలిచారు.  ఉధ్ధవేష్  వెనుకకు  తిరిగి బాబా వద్దకు వచ్చాడు.  అపుడు బాబా “ఇకనుంచి నువ్వు షిరిడీకి రావద్దు.  సరేనా?  నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నీతోనే ఉంటాను.  గుర్తుంచుకో.  ఇక్కడ షిరిడీలోని ప్రజలు చాలా మారిపోయారు.  వారంతా ధనవ్యామోహంతో డబ్బు కోసమే రోదిస్తూ ఉన్నారు.  నన్ను నిరంతరం కష్టపెడుతున్నారు.  (శ్రీ సాయి సత్ చరిత్ర…16 వ. అధ్యాయాన్ని ఒక్క సారి గమనించండి.  బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఒక ధనికుడు బాబా వద్దకు వచ్చిన సందర్భంలో బాబా అన్న మాటలు “అనేకమంది నావద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగనివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు.  ….  నా ఖజానా నిండుగానున్నది.  ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను.  కాని వానికి పుచ్చుకొని యోగ్యత గలదా లేదా యని నేను మొదట పరీక్షించవలెను.  ఇక్కడ ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనము… ఆధ్యాత్మిక ధనమును అడుగువారు చాలా అరుదు తీసుకోవడానికి కూడా యోగ్యత కావాలని బాబా అభిప్రాయము… త్యాగరాజు)

 "నేను చాలా అలసిపోయాను.  నువ్వు యాత్రలకు వెళ్ళినా నీకుటుంబాన్ని కలుసుకోవడానికి వెళ్ళినా ఇప్పుడు, ఇక ఎప్పటికీ ఎల్లవేళలా నేను నోతోనే నీప్రక్కనే ఉంటాను” అని ఈవిధంగా చెప్పి బాబా ఉధ్ధవేష్ తిరిగి వెళ్ళడానికి అనుమతినిచ్చారు.  ఆతరువాత బాబా ముందుగా చెప్పినట్లుగానే, ఉధ్ధవేష్ మరలా షిరిడీ వెళ్లడానికి ఎంతగా ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోయాడు.
అంతే కాదు.  అంతకుముందు ప్రతి ఏకాదశికి బాబాకు ఉత్తరాలు రాసేవాడు.  ఇపుడు ఉత్తరాలు కూడా పంపించలేకపోయాడు.  ఆ తరువాత ఉధ్ధవేష్ కి బాబా మహాసమాధి చెందారన్న విషయ తెలియపరుస్తూ భక్తులందరినుంచి అతనికి ఉత్తరాలు వచ్చాయి.
చివరికి ఉద్ధవేష్ 8 ఆగస్టు 1951 లో సాయిబాబా చరణ కమలాల వద్ద ఐక్యమయ్యాడు.
(సమాప్తం)
(రేపటి సంచికలో చంద్రభాన్ సేఠ్ గారి వారసులతో జరిగిన సంభాషణలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


No comments:

Post a Comment