Tuesday, January 27, 2026

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు… 2 వ.భాగమ్




 28.01.2026 బుధవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయయయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు. (సెప్టెంబరు, అక్టోబరు, 2025 సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)

శ్రీ సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు

శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు… 2 వ.భాగమ్

మరాఠీ నుండి ఆంగ్లానువాదం..  షంషాద్ మీర్జా

తెలుగు అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్,

ఫోన్ --  9440375411 & 8143626744

ఈ మెయిల్.. tyagaraju.a@gmail.com

పిల్లవాడికి కోరినవెంటనే నయమగుట

ఒక ముఖ్య గమనిక::  సాయిబాబా మీద నమ్మకం లేనివారు చదివిన తరువాత దయచేసి హేళనగా వ్యాఖ్యానాలు చేయవద్దని మనవి.  మనం ఎవరి గురించయినా పూర్తిగా తెలుసుకున్న తరువాతనే మనం మాట్లాడాలి, అంతే తప్ప మిడిమిడి జ్ఞానంతో వ్యాఖ్యానాలు అనగా కొత్త దేవుడా? అని వ్యాఖ్యానాలు చేయవద్దు.  ఆయన దేవుడో, యోగిపుంగవుడో, అవధూతయో, సద్గురువో ఆవిషయాలగురించి నేను అయిదు సంవత్సరాల క్రితం ప్రచురించాను.  రామాయణాన్ని తరువాతి కాలాలో ఎంతమంది వ్రాసినా మనకి ప్రామాణికం వాల్మీకి రామాయణం. అలాగే శ్రీ సాయిసత్ చరిత్రకు ప్రామాణికం మరాఠీలో హేమాద్ పంత్ వ్రాసినది, దానికి ఆంగ్లానువాదం చేసిన నగేశ్ వాసుదేవ గుణాజి, తెలుగులోకి అనువాదం చేసిన  శ్రీ ప్రత్తి నారాయణరావుగారు, మరాఠీకి తెలుగు అనువాదం ఓవి టు ఓవి తెలుగు అనువాదం చేసిన మణేమ్మగారి సత్ చరిత్రలు మనకు ప్రామాణికాలు.  అంతే గాని 2017 సం.లో  ఒకామె స్వేచ్చానువాదం చేసిన సత్ చరిత్రలోని కొన్ని వాక్యాలను తీసుకుని దానికి విపరీత అర్ధాలను అంటగట్టి దుష్ప్రచారం చేయడం అవివేకం.   బాబా నాచేత భగవద్గీత, ఉపనిషత్తులు, గురుగీత, నారద భక్తి సూత్రాలు, ఉధ్ధవగీత, చదివించి నా సందేహాలను తీర్చారు. బాబా ముస్లిం కాదు, హిందువే అని నిరూపించే వ్యాసాలను కూడా ప్రచురించాను. సాయి అన్న పదం బాబా వచ్చిన తరువాత పుట్టినది కాదు.  సాయి అంటే ముస్లిం పేరు అనుకుంటున్నారు.  సాయి అంటె భగవంతుడు.  దాని గురించి ముందుముందు ఒక వ్యాసాన్ని తయారు చేస్తాను. ఇక చదవండి.

 

ఒకరోజు రాత్రి 8-15 - 8.30 గంటల మధ్య ఎల్.ఎం. ప్రధాన్ గారింటికి గ్రామాధికారి ఆయన ప్రాణస్నేహితుడు అయిన ఆర్. ఆర్. లక్ష్మణ్ ఖరే గారు వచ్చారు.  ఎంతో బాధ గూడు కట్టుకున్న గొంతుకతో “నా దగ్గర పనిచేసేవాడి కొడుకుకి వయస్సు 8  లేక 9  ఏళ్ళు ఉంటాయి.  వాడిని ఒక విషజంతువు కరిచింది.  నీ దగ్గర దానిని నయం చేసే మందేమయినా ఉందా” అని అడిగాడు.


ప్రధాన్ అపుడే భోజనానికి కూర్చోబోతూ ఉన్నారు.  కాని ఆయనలో ఒక విధమయిన నమ్మకం.  అదే,  నివారణ చేయగల ఔషధం తన వద్ద ఉందనే ప్రగాఢమయిన విశ్వాసంతో భోజనం సంగతి ప్రక్కన పెట్టేశారు.

ఆయన శాంత స్వరంతో తన భార్యతో “బాబా పేరుతో మన పూజా మందిరంలో ఉన్న ఊదీని ఆయనకివ్వు” అన్నారు.

ఆమె వెంటనే ఊదీని తీసుకుని వచ్చి లక్ష్మణ్ రావు ఖరే గారికి ఇచ్చింది. ఆయన ఆ ఊదీని తన పనివాడికి ఇచ్చాడు.  పనివాడు ఆ ఊదీని నీళ్ళలో కలిపి తన కొడుకు చేత త్రాగించాడు.  ఆ పిల్లవాని కడుపులోకి ఊదీ వెళ్ళిన మరుక్షణమే, బాబాయే స్వయంగా తమ స్వహస్తాలతో ఆ పిల్లవాడిని చుట్టి పొదివిపట్టుకున్నారేమో అనిపించేటంతగా ప్రశాంతంగా నిద్రపోయాడు.


తల్లిదండ్రులిద్దరూ రాత్రంతా నిద్ర పోకుండా తమ పిల్లవాడిని కనిపెట్టుకుని ఉన్నారు.

తెల్లవారింది.  ఒక విధమయిన అధ్భుతం జరిగింది.  విషప్రభావాలు పూర్తిగా తగ్గిపోయాయి.

అది కాకతాళియం కాదు.  అందులో ఎటువంటి సందేహం లేదు.  అది బాబా అనుగ్రహం అది ఊదీ ద్వారా సజీవ సాక్ష్యంగా నిరూపితమయింది.

(ఊదీ మహిమలు ఇంకా ఉన్నాయి)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 

No comments:

Post a Comment