Wednesday, June 10, 2026

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు … 12 వ.భాగమ్

 




11.06.2026  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్రచురింపబడిన బాబాలీలలు. (నవంబరు, డిసెంబర్, 2025, సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు … 12 వ.భాగమ్

మరాఠీనుండి ఆంగ్లానువాదం … షంషాద్ మీర్జా

తెలుగు అనువాదం …  ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్

ఫోన్ --- 9440375411 & 8143626744

ఈ మెయిల్ …  tyagaraju.a@gmail.com

శ్రీ సాయిబాబావారి పవిత్రమయిన ఊదీ – మాహాత్మ్యమ్

నమ్మకము ముందు ఓడిన డిఫ్తీరియా

అది 1931 వ. సంవత్సరం ఆగష్టునెల రెండవ పక్షములోని గురువారం రోజు.  ఆరోజున కేవలం ఆరు సంవత్సరాల వయసున్న మా పెద్ద మనుమరాలికి హటాత్తుగా బాగా తీవ్రమయిన జ్వరం వచ్చింది. 

అప్పటివరకు చాలా హుషారుగా ఎంతో ఉత్సాహంగా ఉన్న పిల్లకి హటాత్తుగా తగిలిన జ్వరం 103 డిగ్రీలకు పైగా ఉంది.  శరీరంలో ఉన్న శక్తి అంతా హరించుకుపోతున్నట్లుగా ఉంది.

ఆమె తల్లి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డా.కొఠారేకు ఫోన్ చేసింది.  ఆయన అమ్మయికి మందులు ఇచ్చారు.  సాయంత్రం నేను ఆఫీసునుండి ఇంటికి వచ్చిన తరువాత విషయం తెలిసింది.  సామాన్యంగా వాతావరణ మార్పుల వల్ల వచ్చే సాధారణ జ్వరం అని భావించాను.

జూలై, ఆగష్టు నెలల్లో మాప్రాంతంలో భారీ వర్షాలు కురిసాయి.  అందువల్ల వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా ఇటువంటి జ్వరాలు వస్తూ వెంటనె తగ్గిపోతూ ఉంటాయి.  ఆవిధంగానే మరుసటి ఉదయానికి అమ్మాయికి జ్వరం తగ్గిపోయి ఎప్పటిలాగే మరలా హుషారుగా ఆడుకుంటూ చురుకుగా ఉంది.

శుక్రవారమ్, శనివారమ్, ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు.  మాకెంతో ఊరట కలిగింది.  కాని ఆదివారం మళ్ళీ వర్షం పడటం వల్ల వాతావరణం బాగా చల్లబడింది.  పాప తనకు బాగా చలిగా ఉందని చెప్పి దుప్పటి కప్పుకుని పడుకుంది.

పాప మేనమామ డాక్టరు.  ఆయన బొంబాయిలో వైద్యవృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు.  ఆయన బొంబాయినుండి ఆదివారాలలోను, పండుగ రోజులలోను తన తండ్రిని, ఇంకా తన కుటుంబ సభ్యులందరినీ కలుసుకోవడానికి వస్తూ ఉంటారు.  మా అందరితో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి, సాయంత్రం టీ త్రాగి తిరిగి బొంబాయి వెళ్ళిపోతూ ఉంటారు.

ఆయన తిరిగి వెళ్ళిపోతూ దుప్పటి కప్పుకుని పడుకున్న పాపని చూసి బహూశా ఖచ్చితంగా జ్వరం తగిలే ఉంటుందని అన్నారు.  ఆయన చెప్పినట్లుగానే జ్వరం క్రమక్రమంగా పెరిగి రాత్రయేసరికి 104 డిగ్రీలుంది.

మరునాడు ఉదయం డా.కొఠారే గారిని మరలా పిలిపించారు.  ఆయన పాప గొంతుని పరీక్షించారు.  పాప గొంతులో ఎడమవైపు టాన్శిల్ మీద శనగగింజంత కూడా లేని పసుపు రంగులో ఉన్న వాపుని గమనించారు.  ఒక్కసారిగా ఆయన ముఖ కవళికలు మారిపోయాయి.

“ఇది చాలా తీవ్రమయినది” అని గంభీరంగా అన్నారు.  ఇది డిఫ్తీరియాలాగ కనపడుతోంది.  ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బొంబాయిలోని పరేల్ ఆస్పత్రికి తీసుకువెళ్ళండి.  అక్కడ డా.ఖనోల్కర్ గారికి చూపించండి అన్నాడు.  గడుస్తున్న ప్రతి గంట చాలా విలువైనది.  నేనిక్కడ ఇంజక్షన్ చేయడానికి ఏర్పాటు చేయలేను” అన్నాడు.

ఆయన మాటలు విన్న తరువాత నా గుండె జారిపోయింది.  నా చేతులు కాళ్ళు వణకసాగాయి.  ఎందుకంటే డిఫ్తీరియా ఎంత భయంకరమైనదో, అంటువ్యాధో నేను పుస్తకాలలో చదివాను.  ఆరోజుల్లో ఆవ్యాధి తరచుగా ప్రాణాంతకంగా ఉండేది.  అందువల్ల దాని ప్రస్తావన వస్తే చాలు కుటుంబంలోని ప్రతివాళ్ళు భయంతో వణికిపోతూ ఉండేవారు.  ఉదయం తొమ్మిది గంటలకు మాకు ఈ భయంకరమయిన వార్త అందింది.

వృత్తి రీత్యా డాక్టరయిన మా అబ్బాయికి వెంటనే ఈ విషయాన్ని మేము ఫోన్ ద్వారా తెలియచేశాము.  అరగంటలో వెంటనే బొంబాయినుండి బయలుదేరి వచ్చాడు  అప్పటికి పాపకి వెచ్చని బట్టలు చుట్టి కారులో పడుకోబెట్టి డాక్టర్ తో సహా త్వరత్వరగా పరేల్ కి బయలుదేరాము.


పాపని తీసుకువెళ్ళేముందు శ్రీసాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్ధించుకుని, బాబా కరుణ దయ ప్రసరింపచేయమని వేడుకొంటూ చిటికెడు ఊదీని పాప నుదుటి మీద రాసాము.

 (ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment