


23.11.2011 బుధవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు శుభాసీస్సులు
ఈ రోజు నెల్లురు నించి సుకన్య గారు సేకరించి పంపిన ఒక అద్భుతమైన బాబా లీలను తెలుసుకుందాము. ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవోని ధైర్యంతో, అపరిమితమైన భక్తితో బాబానే నమ్ముకున్న సాయి భక్తుడు చెప్పిన ఈ అద్భుతమైన లీలను వారి మాటలలోనే తెలుసుకుందాము.
కాన్సర్ బారినుండి కాపాడిన బాబా
నా పేరు రాజ శేఖర్. బాబా అనుగ్రముతో నాకింతవరకు ఎటువంటి సమస్యలు ఎదురుకాలేదు. ఎప్పుడయినా నేనొక విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు అది ఒక సమస్యగా అవుతూ ఉండేది. బాబా నన్నా కష్టాన్నుండి గట్టెంక్కించేవారు. ప్రతీక్షణం ఆయన నాతోనే ఉన్నారని నేను నమ్ముతాను. ప్రంపంచం లో అందరినీ ఆయన కాపాడుతూ ఉంటారు. ఎన్నో ప్రశ్నలకి సమాధాలనిచ్చి పరిష్కారాలను సూచించారు. ఆయనే నా జీవితం, అనురాగం, ఆయన లేని జీవితాన్ని నేనూహించుకోలేను.
సుమారు నాలుగునెలల క్రితం నా సోదరి రెండవసారి గర్భిణీతో ఉందనే సంతోషకరమైన వార్త తెలిసింది. మేమంతా చాలా సంతోషించాము. ఆమె అత్తింటివారు షిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకుని షిరిడీకి ప్రయాణమయ్యారు.
షిరిడీలో వారికి దర్శనం బాగా జరిగింది. దర్శనం అయిన తరువాత యింటికి తిరిగి వచ్చారు. నా సోదరి చాలా తెలివయిన విద్యార్థిని. ఆమె దూరవిద్యద్వారా ఎం.సీ.ఎ. చదువుతోంది. తను హైదరాబాదునుంచి విజయవాడకు (స్వంత ఊరు, పుట్టిల్లు) వెళ్ళేటప్పటికి నాలుగవ నెల అనుకుంటాను. అప్పుడామె రెండవ సంవత్సరం పరీక్షలకు తయారవుతోంది. ఆ సమయంలో ఆమె విపరీతమయిన నొప్పితో బాధ పడుతూ ఉండేది. మేము డాక్టరుని కలిసి పరిస్థితిని వివరించాము. అంతా బాగానే ఉంది సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు అందరికీ వచ్చే సామాన్యమయిన నొప్పులే అని డాక్టరుగారు చెప్పారు. నా సోదరికి రోజు రోజుకీ నొప్పి ఎక్కువ కాసాగింది. రాత్రిళ్ళప్పుడు నిద్ర పోలేనంతగా నొప్పి ఎక్కువ కాసాగింది. ఇలా ఉండగా నా తల్లి తండ్రులకి సిల్వర్ జూబిలీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు (వివాహమయిన 25 సంవత్సరాలు). నేను ఒక్కడినె కొడుకుని కాబట్టి హైదరాబాదు నుంచి విజయవాడకు బయలుదేరాను. నేనెప్పుడూ నాతో ఊదీ తీసుకుని వెడుతూ ఉంటాను. కాని ఈ సారి నేను విజయవాడలో ఉండేది మూడు రోజులే కాబట్టి ఊదీ అవసరం ఉండదని భావించాను. కాని ఎందుకనో ఊదీ ని తీసుకుని విజయవాడకు ప్రయాణమయ్యాను. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. నా సెలవు అయిపోయిన నాలుగవ రోజు పొద్దున్నే హైదరాబాదుకు ప్రయాణమయ్యాను. రైలు స్టేషన్ కి చేరుకున్న తరువాత, యింటిదగ్గరే ఊదీ ఉన్న చిన్న పెట్టి మర్చిపోయానని గుర్తుకు వచ్చింది నాకు. ఏమి చేయాలో నా కర్ధం కాలేదు. యింటికి వెళ్ళి ఊదీ తెచ్చుకుందామనుకున్నాను. కాని ఏదొ అంతరాత్మ ప్రబోధించినట్లు ఇలా అనిపించింది. "దానిని అక్కడే వదలివేయి. ఎందుకంటే ఒక పెద్ద సమస్య ఎదురవబోతోంది." అన్య మనస్కంగానె అసంతృప్తితో నేను హైదరాబాదు చేరుకున్నాను.
3, 4 రోజుల తరువాత నా సోదరికి భరించలేనంతగా నొప్పి రావడంతో డాక్టరు వద్దకు వెళ్ళారు. ఆమె ఆర్థో సర్జన్ (ఎముకల వైద్య నిపుణుడు) వద్దకు తీసుకువెళ్ళమని సలహా ఇచ్చారు. నా తల్లితండ్రులు ఆమెని బోన్స్ స్పెషలిస్ట్ వద్దకు తీసుకునివెళ్ళారు. నా సోదరికి స్పైనల్ కార్డ్ లో టిష్యూ (ట్యూమర్) ఉందనీ అదే కాళ్ళకి, నడుము నొప్పికి కారణమవుతోందనీ చెప్పారు.
బాబా రాబోయే ప్రమాదాన్ని ముందే సూచించారనీ, ఊదీ రాయమనీ మా అమ్మగారికి చెప్పాను.
పరీక్షలు అయిపోయిన తరువాత తను మా అమ్మగారితో హైదరాబాదు వచ్చింది. కాని ప్రతీ రోజు నెప్పితో బాధపడుతూ ఉండేది. హైదరాబాదులో కుడా మేము ప్రసూతి వైద్యురాలిని సంప్రదించాము. కానీ ఆమె, అసలు సమస్య ఏమిటో గుర్తించకుండా నొప్పితగ్గడానికి మందులు ఇచ్చారు. యిక ఏమాత్రం భరించలేనంతగా నొప్పి ఎక్కువయింది. ఆమె ప్రతీరోజు బాధతో బాగా ఏడవటం మొదలెట్టింది. నాకు మరొకసారి అంతర్యామి ఇలా చెప్పింది "ఆమెని సాయి తత్వం చదవమను" ఆమె వెంటనె సాయి తత్వం చదవడం ప్రారంభించింది. నాలుగు అధ్యాయాలు పూర్తి చేసింది. కాని నొప్పి ఇంకా ఎక్కువవడంతో ఇక చదవలేకపోయింది. యిక ఆఖరికి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చూపిద్దామనె నిర్ణయానికి వచ్చాము. ఆ సమయంలో నా సోదరికి నడవటం కూడా చాలా కష్టమయింది. ఆమెని చక్రాల కుర్చీలో తీసుకుని వెళ్ళవలసివచ్చింది. 23 సంవత్సరాల వయస్సున్న నాసోదరిని నేనెప్పుడు అంతలా ఊహించలేదు. మాకు చాలా బాధ వేసింది.
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉన్న డాక్టర్స్, స్పైనల్ కార్డ్ లో ఉన్న ట్యూమర్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసివేయాలనీ అదే నడుము, కాళ్ళ నొప్పికి కారణమనీ చెప్పారు. డాక్టర్స్ ఇంకా ఇలా అన్నారు, "ఆమెకు కాళ్ళు కదపలేకపోయే పరిస్థితి కూడా రావచ్చు, లేక నడవటానికి 3 నుంచి 6 మాసాలు పట్టవచ్చు". ఇంతవరకు బాబా అంతా చూసుకుంటారనే నమ్మకంతోనే ఉండి బాధపడలేదు. కాని ప్రతీక్షణం పరిస్ఠితులు మారిపోవడం మొదలైంది. ఆమె తొందరగా నడిచేటట్లు చూడమనీ, ఆమె చక్రాల కుర్చీలో తిరగడం చూడలెననీ బాబా వద్ద రోదించాను.
ఆ సమయం లో మా బంధువలందరూ వచ్చి మాకు దైర్యాన్ని చెప్పారు. ఈ ఆపరేషన్ విజయవంతమయ్యి నా సోదరి తొందరలోనే నడిచేటట్లు చేయమని మేమంతా బాబాని ప్రార్థించాము. మరునాడు ఆపరేషన్ అయినతరువాత డాక్టర్స్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందనీ, ఆస్పత్రిలో 10 రోజులు ఉండాలనీ చెప్పారు. అసలు ఇది ఎందుకని వచ్చిందో తెలియడానికి తీసివేసిన భాగాన్ని బయాప్సీ పరీక్ష కోసం పంపిస్తామని చెప్పారు. ఒక వారం రోజుల తరువాత అది కాన్సర్ వల్ల అని చెప్పారు. నాకు బాగా దుఃఖం వచ్చింది. ఆమెని ఈ కాన్సర్ బారినుండి గట్టెక్కించమని బాబాని ప్రార్థించాను. నాకంతకన్న మార్గం తోచలేదు. మరలా మరలా బాబా పాదాలను పట్టుకుని నా సోదరికి ఆరోగ్యాన్ని ప్రసాదించి మామూలు మనిషిని చేయమని వేడుకున్నాను. మేము మా సోదరిని మల్టీ స్పెషాలిటీ కాన్సర్ ఆస్పత్రిలో చేర్పించాము. కాన్సర్ కి వైద్యం కెమోథెరపీ మొదలుపెట్టడానికి ముందర అబార్షన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. కాన్సర్ కి చాలా శక్తివంతమైన మందులు వాడటం వల్ల కడుపులోని బిడ్డకి కూడా హానికరం అవుతుందనే ఉద్దేశ్యంతో మేము కూడా దానికి సరే అన్నాము. కాని అబార్షన్ చెయలేదు. ఈ సమయంలో కూడా తను నడవలేకపోయేది. కాని బాబా దయ వల్ల గురువారము నాడు సుఖ ప్రసవమయింది. (సిజేరియన్ అవుతుందేమో అనుకున్నాము అది ఇంకా బాధాకరంగా ఉండేది.) కాని బాబా అనుగ్రహంతో నార్మల్ డెలివరీ అయింది, కాని శిశువు కొద్ది గంటలలోనే మరణించింది.
సర్జరీ అయిన తరువాత ఆమె నడవటానికి కనీసం 3 నించి 6 నెలలు పడుతుందనీ లేకపోతే అసలు నడవలేదనీ డాక్టర్స్ చెప్పి రెండు నెలలు అయింది. బాబా దయవల్లనే తను యెటువంటి ఆధారము లేకుండగానే నడవగలుగుతోంది, కాని మునపటిలా కాదు. కాలం గడిచేకొద్దీ బాబా దయవల్ల తను మామూలుగా నడవగలుగుతుందని నాకు గట్టి నమ్మకం. తనకి కెమోథెరపీ 4 సిట్టింగ్స్ అయ్యాయి. 4 సిట్టింగ్స్ తరువాత ఎంతవరకూ గుణం కనపడిందో మందులు ఎంతవరకూ పనిచేసాయో తెలియాలంటే మరొక పరీక్ష చేయవలసి ఉంది. ఒకవేళ గుణం కనపడకపోయి ఉంటే కనక ఇంకా 8 సిట్టింగ్స్ అవసరమవుతాయి. దానికి నా సోదరి చాలా భయపడింది. అది చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ బాధని భరించడానికి సిధ్ధంగా లేదు. ఆమెకు ఇంక భరించే శక్తి లేదనీ ఆమెను ఈ బాధనుండి తప్పించమని బాబాని శ్రధ్ధ సబూరీతో వేడుకున్నాను. ఇప్పుడు జరిగే ఆఖరి కెమోథెరపీయే ఆఖరిదయేటట్లుగా చేయమని బాబాని మరీ మరీ వేడుకున్నాను.
ఆమెకు ఆ జబ్బు వచ్చిన దగ్గరనుండీ బాబా సహాయం చేస్తున్నారని గమనించాము. మాకసలు సమస్య ఏమిటన్నదని కూడా తెలియని సమయం నించీ బాబా సహాయం చేస్తూనే ఉన్నారు. నేను ప్రయాణమయేటప్పుడు నాతో ఊదీ తీసుకుని వెడదామనుకోలేదు. కాని బాబా నేను ఊదీ తీసుకుని వెళ్ళేటట్లుగా చేసారు. ఈ సమస్య ఎదురవుతుందని ఆయనకు ముందే తెలుసు. నాలో చెప్పిన అంతర్వాణి బాబా. బాబాయే నన్ను ఊదీ మర్చిపోయేలా చేశారు. అసలు నేను కలలో కూడా ఊదీ మరచిపోవడం జరగదు. నేను ఊదీ ఇంటిలోనే మరచిపోయి ప్రయాణమయ్యాను. ప్రసూతి వైద్యురాలు ఆర్థో సర్జన్ ని కలవమని చెప్పిన తరువాత ఆయన స్పైనల్ కార్డ్ లో ట్యూమర్ ఉందని చెప్పారు. అప్పుడు మా అమ్మగారు ఊదీ రాయడం మొదలుపెట్టారు. నా సోదరికి "సాయి తత్వం" ఇచ్చి చదవమని చెప్పేలా సాయి నన్ను ప్రేరేపించారు. డాక్టర్స్ చెప్పినదానికన్నా ముందుగానే తను నడవగలిగేలా చేసారు. తనకి తొందరలోనే బాగవుతుందనే నమ్మకం నాకుంది. ప్రపంచం లో అందరికన్నా గొప్ప వైద్యుడు బాబా యే అని మనకందరకూ తెలుసు. ఆయన తన అనుగ్రహంతో నయం చేయలేని జబ్బు ఏదీ లేదు.
నేను బ్లాగుద్వారా షిరిడీకి ప్రేయర్ పంపించాను. నేను ఇది ఎలా పంపించానో మీకు తెలుసా? తన భక్తులకు దారి ఆయనే చూపిస్తారు. బ్లాగులో నేను ప్రతీ చోటా క్లిక్ చేసేలా చేసారు. ఉమామహేశ్వరిగారు షిరిడీ వెడుతున్నట్లు, ఎవరయినా ప్రేయర్స్ పంపిస్తే తను షిర్దిలో బాబా చరణాల వద్ద ఉంచుతాననే సందేశం చదివి వారి ఈ మైల్ కి నా సోదరి గురించి అంతా వివరంగా పంపించాను. తరువాత నాకు ఆమె వద్దనుండి జవాబు వచ్చింది. వారు మార్చ్ 20 తేదీన షిర్దిడీ చేరుకున్నట్లు దర్శనం బాగా అయిందని ప్రేయర్స్ అన్నీ బాబా చరణాల వద్ద పెట్టినట్లు జవాబిచ్చారు. సాయంత్రము హారతి కి వెళ్ళినప్పుడు, ప్రేయర్స్ అన్నీ కూడా పూజారిగారికి ఇచ్చినట్లు, వారు వాటినన్నిటినీ బాబా చరణాలవద్ద ఉంచినట్లు జవాబిచ్చారు.
మనం మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్లు జీవించలేము. అంతా బాబా యే నడిపిస్తారు, మనము చేయవలసినదల్లా బాబా చెప్పినట్లు నడచుకోవడమే.
కెమోథెరపీ యెలా పనిచేస్తోందో తెలుసుకోవడానికి మరొక పరీక్ష చేయాల్సి ఉందని ఇంతకు ముందు మీకు చెప్పాను. డాక్టర్స్ స్కాన్ చేసి ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. నా ఆనందానికి అవధులు లేవు. ఆస్పత్రిలో నేను ఆనందంతో గంతులు వేసాను. తరువాత మేము డాక్టర్ని కలిసాము. ఆమెకు నయమయినప్పటికీ ఇంకా మిగిలిన 8 సిట్టింగ్స్ జరగాలని చెప్పారు. మేము ఆయన చెప్పినదానికి కాదనకుండా ఒప్పుకున్నాము. మరలా కెమోథెరపీ మొదలుపెట్టారు. సిట్టింగ్స్ అన్నీ కూడా పూర్తయిన తరువాత కెమోథెరపీ ఎంతవరకూ పనిచేసిందో చూడటానికి మరొకసారి స్కాన్ చేసి చూస్తారు. కెమోథెరపీ పూర్తయింది. మరలా ఒకసారి స్కాన్ చేసి చూసి ఆమె పూర్తిగా ప్రమాదం నించి బయటపడిందని చెప్పారు. ఏమయినప్పటికీ భవిష్యత్తులో మరలా రాకుండా రేడియేషన్ ట్రీట్మెంట్ ఇప్పించడం మంచిదని సలహా ఇచ్చారు. మరొక డాక్టర్ ని కూడా సంప్రదించి అది అవసరమవుతుందో లేదో తరువాత చెపుతానని డాక్టర్ చెప్పారు.
వైద్య ప్రక్రియ మొత్తం పూర్తయినా గానీ, ఇంకా రేడియేషన్ అవసరముంటుందని చెప్పడంతో మాకు చాలా బాధ వేసింది. ఏమిచేయాలో మాకు పాలుపోలేదు. తనకి మిగిలిన 8 సిట్టింగ్స్ అవసరమవుతుందని డాక్టర్స్ చెప్పినప్పుడు నేను బాబాని ఏమీ అడగలేదు. ఆమె తన గత జన్మల కర్మను అనుభవిస్తోందనీ రాబోయే నాలుగు నెలలలోఅంతా పూర్తయిపోతుందనీ నేను భావించాను. కాని, రేడియేషన్ అవసరమవుతుందని చెప్పినప్పుడు, నా సోదరికి ఇక భరించే శక్తి లేదని నేను బాబాకి చెప్పుకున్నాను. నేను మామూలుగా ఆఫీసుకు వెళ్ళిపోయాను. మేము డాక్టర్స్ ని సంప్రదిస్తూనే ఉన్నాము. "రేడీయేషన్ ట్రీట్మెంట్ చేద్దామా వద్దా అనే సందిగ్ధం లో ఉన్నామని" డాక్టర్స్ చెప్పారు. కొందరు డాక్టర్స్ అవసరమౌతుందనీ, కొంతమంది అవసరం లేదనీ చెప్పారని చెప్పారు.
మేము బొంబాయి వెళ్ళి ఆక్కడి డాక్టర్ ని కలిసాము. వారు రేడియేషన్ అవసరం లేదని చెప్పారు.
మేమంతా చాలా సంతోషించాము. అందరమూ హైదరాబాదుకు తిరిగి వచ్చాము. టాటా కాన్సర్ సెంటర్ కి వెళ్ళి టెస్ట్లు చేయించుకోమని సలహా ఇచ్చిన డాక్ట్ర్ర్ ర్ ని కలిసి విషయమంతా వివరించాము. కాని ఆ డాక్టర్ మేము చెప్పినదానికి నమ్మకం కుదరక మరలా ఇంకొక డాక్టర్ ని సంప్రదించి చెపుతానని చెప్పారు. డాక్టర్స్ అందరూ ఎందుకిలా సరియైన నిర్ధారణకు రాలేకపోతున్నారని మాకు కలవరం కలిగింది. ఆమె క్షేమం బాబాయే చూసుకుంటారనీ, డాక్టర్స్ సరియైన నిర్ణయం తీసుకునేలా బాబాయె చూస్తారనీ నాకు తెలుసు. వారం రోజుల తరువాత డాక్టర్స్ రేడియేషన్ అవసరం లేదని నిర్ధారణగా చెప్పారు. ఆ సమయంలో నేను శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేస్తున్నాను. నా సోదరికి రేడియేషన్ అవసరముండదని బాబా ఎన్నో అనుభూతులను, మంచి ఆలోచనలను సాయి నాకు ప్రసాదించారు. మేమంతా కూడా చాలా సంతోషించాము.
నేను భక్తులందరికీ చెప్పేదేమిటంటే పూర్తిగా ఆయనపై నమ్మకముంచండి. బాబా మీలో ఉన్న బాధలన్నిటినీ పోగొడతారు. ఆయనని అర్ధం చేసుకోవాలంటే శ్రధ్ధ, సబూరీ కావాలి. నేనెప్పుడు ఆయన మీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. నా సోదరి యోగక్షేమమంతా కూడా బాబా చూసుకున్నారు. ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మేమంతా షిరిడీ వెడుతున్నాము. నాకెన్నో బాబా అనుభూతులు కలిగాయి. వాటికి అంతం లేదు. మనలనందరినీ రక్షించేది బాబాయే.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment