Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, May 15, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –21 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 4:07 AM

 


15.05.2023  సోమవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


ఓమ్ శ్రీ సాయినాధాయనమః

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః


శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –21 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744

(శ్రీమద్భగవద్గీత 10 వ అధ్యాయములోని  శ్లోకాలనే వేణుగోపాలస్వామి దేవాలయంలో వింటున్నప్పుడు నాకు శ్రీ సాయి సత్ చరిత్రలోని విషయాలు గుర్తుకు వచ్చాయి. )

శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 10 విభూతి యోగము

శ్లోకమ్ – 9

మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్

కధయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ



నా భక్తులు నా యందే తమ మనస్సులను లగ్నమొనర్తురు.  తమ ప్రాణములను, తమ కర్మలన్నింటిని, తమ సర్వస్వమును నాకే అంకితమొనర్తురు.  వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్యమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు, కధలు కధలుగా చెప్పుకొనుచు, నిరంతరము సంతుష్టులగుచుందురు.  మఱియు వారు సంతతము నాయందే రమించుచుందురు.

శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయమ్ – 10

 షిరిడీ జనులు ధన్యులు.  సాయియే వారి ఆరాధ్య దైవం.  భోజన శయన వేళలందు కూడా నిరంతరం సాయి నామస్మరణలో ఉండేవారు.  వారు పొలాలలో పని చూసుకుంటున్నా, ఇంటిలో ధాన్యం దంచుతున్నా, చెరుగుతున్నా, కూర్చుని ఉన్నా, బాబా మహిమను గానం చేసేవారు.  సాయి వినా వేరు దైవాన్ని వారెరుగరు.

శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 10  శ్లోకమ్ – 20

అహమాత్మా గుడాకేశ సర్వ భూతాశయస్థితః

అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ

ఓ! అర్జునా!  సమస్త ప్రాణుల హృదయమందున్న ఆత్మను నేనే.  సకల భూతముల (ప్రాణుల) ఆత్మను నేనే.  సకల భూతముల (ప్రాణుల) ఆదియు, మధ్యస్థితియు అంతము నేనే.  (ప్రాణులయొక్క సృష్టిస్థితి లయములకు కారణము నేనే)

శ్లోకమ్ – 32

సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున

అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్

ఓ! అర్జునా! సృష్టికి ఆదిమధ్యాంతములు నేను.  (సృష్టిస్థితి లయ కారకుడను నేనే)  విద్యలలో అధ్యాత్మ విద్యను.  అనగా బ్రహ్మవివ్యను నేను.  పరస్పర వివాదములలో తత్త్వ నిర్ణయమునకై చేయు వాదమును నేను.

శ్లోకమ్ – 39

యచ్చాపి సర్వ భూతానాం బీజం తదహమర్జున

న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరమ్

ఓ! అర్జునా! సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే.  ఏలనన నేను లేని చరాచర ప్రాణి యేదియును లేదు.

అనగా సమస్తము భగవత్స్వరూపమే అని శ్రీకృష్ణపరమాత్మ చెప్పుచున్నారని మనం గ్రహించుకోవచ్చు.  ప్రాణుల ఉత్పత్తికి కారణము అనగా బీజము తానే అని భగవానుడు చెప్పాడు.  బీజము పరమాత్మ అయినపుడు మొలక మరియొకటి అవదు కదా.  అదికూడా పరమాత్మే.  ఈ విధంగా సమస్త జీవరాశులు భగవత్స్వరూపులే అని స్పష్ట పడుతోంది.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 3

బాబా అన్న మాటలు…”మీరెక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, మీ విషయాలన్నీ నాకు సంపూర్ణముగా తెలుస్తాయనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి.  నేను నేను అని చెప్పే నేనే అందరిలోనూ ఉన్న అంతర్యామిని.  ఆ నేనే అందరి హృదయాలలోనూ ఉన్నాను.  అందరి స్వామిని నేనే.  సర్వ భూతాలలోను, చరాచరాలలో బాహ్యాంభ్యంతరాలలో నిండి ఉన్నాను.  ఈ సకలం ఈశ్వరుని సూత్రం.  నేను అతని సూత్రధారుణ్ణి.  నేను సకల ప్రాణులకు మాతను.  నేను త్రిగుణాల సామ్యావస్థను.  కర్తా భర్తా సంహర్తా నేనే.  సకలేంద్రియాలను నడిపించువాడను నేనే.  నాయందు లక్ష్యమున్నవారికి ఏ కష్టాలుండవు.  నన్ను మరచిపోయినవారిని మాయ బాధిస్తుంది.  ఈ దృశ్యప్రపంచమంతా నా స్వరూపం.  చీమలు, దోమలు పురుగు, పుట్ర, రాజు, పేద, సకల చరాచర విశ్వమంతా నా రూపం”.

(శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ 15 లో కూడా బాబా ఇదే విధంగా చెప్పారు.)

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)

 

Wednesday, May 3, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –20 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:29 AM

 


03.05.2023  బుధవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


ఓమ్ శ్రీ సాయినాధాయనమః

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –20 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744వ.



శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 9 రాజవిద్యా రాజగుహ్య యోగము

శ్లోకమ్ – 26

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయఛ్చతి

తదహం భక్త్యు పహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః

నిర్మల బుధ్ధితో, నిష్కామ భావముతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రమును గాని, పుష్పమును గాని, జలమును గాని, నేను ప్రత్యక్షముగా (స్వయముగా) ప్రీతితో ఆరగింతును.

 

శ్లోకమ్ – 27

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్

యత్తపశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్

ఓ కౌంతేయా నీవు ఆచరించుచున్న కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము.

(పైన చెప్పిన శ్లోకము యొక్క అర్ధాన్ని బట్టి మనం ఏమి భుజిస్తున్నా, త్రాగుతున్నా, మనము ఇచ్చే దానమును భగవదార్పణమస్తు లేక సాయినాధార్పణమస్తు అని మనసులో అనుకుంటే ఆ భగవంతునికి సమర్పించినట్లే.   మనము ఏమి భుజిస్తున్నా బాబా గారే భుజిస్తున్నారు, లేక ఏమి త్రాగుతున్నా బాబా గారే త్రాగుతున్నారు అనే భావంతో ఉండాలి )

శ్రీ సాయి సత్ చరిత్ర -  అధ్యాయమ్ – 9

తన భక్తుడేదైన తనకు సమర్పించవలెననుకొని, ఏ కారణము చేతనయినా ఆసంగతి మరచినచో, అట్టివానికి బాబా ఆవిషయము జ్ణాపకము చేసి, ఆ నివేదనను గ్రహించి, ఆశీర్వదించేవారు.

తర్ఖడ్ కుటుంబము ఉదాహరణ.

రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ గారి భార్య, కుమారుడు ఇద్దరూ కలిసి షిరిడీకి బయలుదేరారు.  బయలుదేరే సమయంలో కుమారుడు తాము ఇంటిలో లేని సమయంలో, బాబాకు ప్రతిరోజు పూజ చేసి నైవేద్యము పెట్టమని కోరారు.  తండ్రి కుమారునికి ఇచ్చిన  మాట ప్రకారం బాబాకు పూజ చేసి, నైవేద్యంగా కలకండను అర్పించారు. ఒకరోజు కలకండను నైవేద్యం పెట్టడం మరచిపోయి కచేరీకి వెళ్ళిపోయారు.  అక్కడ షిరిడీలో బాబా, ఆత్మారాముని భార్యతో “తల్లీ ఏమయినా  తినవలెనను ఉద్దేశ్యముతో బాంద్రాలోని మీ ఇంటికి వెళ్ళాను.  తలుపులకి తాళం వేసి ఉంది.  ఎలాగో లోపలకు ప్రవేశించాను.  కాని అక్కడ తినటానికి ఏమీ లేకపోవడం వల్ల తిరిగి వచ్చేశాను.” అన్నారు.  ఆ సమయంలో ప్రక్కనే ఉన్న కుమారునికి తన ఇంటిపూజలో ఏవో లోటుపాటులు జరిగాయని అర్ధం చేసుకొన్నాడు.

ఆత్మారాముని భార్య బాబాకు నైవేద్యంగా వంకాయ పెరుగు పచ్చడి, వంకాయవేపుడు కూర, పేడా తయారు చేసి పెట్టడానికి సంకల్పించినపుడు బాబా వాటిని ప్రీతితో అడిగి స్వీకరించారు.

1915 డిసెంబరులో గోవింద బాలారాం మాన్ కర్ అనే అతను షిరిడీకి వెళ్ళి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయాలనుకున్నాడు.  ప్రయాణమవడానికి ముందు ఆత్మారాముని వద్దకు వచ్చాడు.  ఆత్మారాముని భార్య బాబా కోసం ఏమయినా పంపుదామని ఇల్లంతా వెదికింది.  కాని, ఒక్క పేడా తప్ప ఏమీ కనిపించలేదు.  ఆ పేడాని కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించేసింది.  తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉన్నాడు.  కాని, బాబాయందున్న భక్తిప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపించింది. బాబా దానిని స్వీకరించి తింటారనే నమ్మకంతో ఉంది.  గోవిందుడు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు.  కాని, పేడాను తీసుకువెళ్లడం మర్చిపోయాడు.  అప్పుడు బాబా నాకేమి తెచ్చావని గోవిందుడిని అడిగారు. ఏమీ తీసుకురాలేదని గోవిందుడు సమాధానమిచ్చాడు.  వెంటనే బాబా “నీవు ఇంటివద్ద బయలుదేరేటప్పుడు ఆత్మారాముని భార్య నాకొరకు నీచేతికి మిఠాయి ఇవ్వలేదా?” అని అడిగారు.  బాలారాం మాన్ కర్ అంతా గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడి బాబాను క్షమాపణ కోరాడు.  బసకు పరుగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాడు.  చేతిలో పడినవెంటనే బాబా దానిని గుటుక్కున మ్రింగారు.  ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించారు.  “నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారినావిధంగానే అనుగ్రహింతును”  గీతా వాక్యము అధ్యాయమ్ – 4  శ్లోకమ్ – 11)

శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 4  శ్లోకమ్ – 11

యే యధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహమ్

మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్ధ సర్వ శః

పార్ధా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును.  మనుష్యులందరును నా మార్గమునే అనుసరింతురు.

శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయమ్ – 13

“పూజా తంతుతో నాకు పనిలేదు.  షోడశోపచారములు గాని, అష్టాంగ యోగములు గాని, నాకు అవసరము లేదు.  భక్తి యున్న చోటనే నా నివాసము.”

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)

 

 

 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List