Wednesday, January 18, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –12 వ.భాగమ్


18.01.2023 బుధవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


       ఓమ్ శ్రీ సాయినాధాయనమః

       శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః

       

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –12 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744వ.

శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ _ 6 శ్లోకమ్  -  22

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః

యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే



పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు (అనగా భగవత్సాక్షాత్కారమును పొందినవాడు) మఱేయితర లాభమును కూడా దానికంటే అధికమైనదానినిగా తలంపడు.  బ్రహ్మానందానుభవ స్థితిలో నున్న యోగిని ఎట్టి బలవదుఃఖములును చలింపజేయజాలవు.

(ఇంతకు ముందు బాబాయొక్క జీవన విధానం గురించి వివరించాను.  మీరు చదివే ఉంటారు.  ముందు భాగంలో బాబా ఎటువంటి సంపదలను ఆశించలేదని, కలిమిలేములు వారికి సమానమని, శ్రీ సాయి సత్ చరిత్రలోని అధ్యాయాలలోని విషయాలను ఉదహరించాను.  బాబా భగవత్సాక్షాత్కారమును పొందిన మహాయోగి.  ప్రపంచంలోనే వెలకట్టలేని భగవత్సాక్షాత్కారము ఎన్ని కోట్ల సంపదలకు సాటిరాదు.)

శ్రీ సాయి సత్ చరిత్ర  అధ్యాయమ్ – 8

బాబా ఎప్పుడూ ఆత్మనిష్టలో ఉంటూ, పేద ఫకీరువలె ప్రవర్తించేవారు.  వారికి దుఃఖంలో శోకం లేదు, సుఖాలలో ఆనందం లేదు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ -  4

బాబా స్వప్నావస్థయందయినను ప్రపంచ వస్తువులను కాంక్షించెడివారు కాదు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్  -  10

బాబా ఎల్లప్పుడు ఆత్మానుసంధానమందే మునిగి యుండెడివారు.

శ్రీ మధ్భగవద్గీత – అధ్యాయమ్ – 6 శ్లోకమ్ – 27

 ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్

ఉపైతి శాంతరజసం బ్రహ్మాభూతమ కల్మషమ్

ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానంద ఘనపరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్  -  4

వారు కష్టతరమయిన సంసారమును జయించినవారు. (అటువంటి సంసారమును జయించినవాడు ప్రశాంతమయిన మనస్సుతో నిరంతరం జీవిస్తూ ఉంటాడని నా అభిప్రాయము) శాంతియే వారి భూషణము.  నశించు వస్తువులందభిమానము లేనివారు.  వారి అంతరంగము అద్ధమువలె స్వచ్చమైనది.  ఎల్లప్పుడు ఆత్మధ్యానమునందే మునిగియుండెడివారు.  ఎల్లప్పుడు సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 22

ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనము పాటించువారు.  అది వారియొక్క బ్రహ్మబోధము.

శ్రీ సయి సత్ చరిత్ర అధ్యాయమ్  -  37

శ్రీ సాయిబాబా జీవితము మిగుల పావనమయినది.  వారి నిత్యకృత్యములు ధన్యములు.  వారి పధ్ధతులు, చర్యలు వర్ణింపనలవికానివి.  కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచెడివారు.  మరికొన్ని సమయములందు ఆత్మజ్ణానముతో తృప్తి పొందెడివారు.  ఒక్కొక్కప్పుడన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబందము లేనట్లుండెడివారు. ఒక్కొక్కపుడేమియు చేయనట్లు గనిపించినప్పటికిని వారు సోమరిగా గాని, నిద్రితులుగా గాని కనిపించెడివారు. కాదు. వారు ఎల్లప్పుడు ఆత్మానుసంధానము చేసెడివారు.

శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 6  శ్లోకమ్ -  28

యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః

సుఖేన బ్రహ్మసంస్పర్శమ్ అత్యంతం సుఖమశ్నుతే

పాపరహితుడయిన ఆయోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమొనర్చుచు, పరబ్రహ్మ పరమాత్మప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును.

శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయమ్  - 10

బాబా ఎల్లప్పుడు తమ ఆత్మ స్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై యుండువారు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)

 


No comments:

Post a Comment