Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, October 21, 2012

రామాయణంలో శ్రీసాయి 9వ. భాగము

Posted by tyagaraju on 5:53 PM



                                                

21.10.2012 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

రామాయణంలో శ్రీసాయి 9వ. భాగము 

మన హృదయాలను పరిపాలించేది భగవంతుని చరణకమలాలే అని రామాయణం ద్వారా మనకు అర్ధమవుతుంది. 

శ్రీరామచంద్రులవారు రాజ్యాన్ని త్యజించి అడవులకు వెళ్ళారు. ప్రీతిపాత్రుడయిన రాముని యొక్క వియోగాన్ని భరించలేక దశరధ మహారాజు స్వర్గస్తులయారు .


తాను లేని సమయంలో తల్లి మూర్ఖత్వం వల్ల ఇటువంటి విపరీత పరిణామాలన్ని జరిగడంతో భరతుడు చాలా దుఖించాడు. అరణ్యానికి వెళ్ళి రాములవారిని ఒప్పించి తిరిగి రాజ్యానికి తీసుకుని వచ్చి పరిపాలనా బాధ్యతలను రామునికి అప్పగిద్దామనుకున్నాడు. శ్రీరామచంద్రులవారు తనకు బదులుగా తన పాదుకలను అయోధ్యకు తీసుకొనివెళ్ళి సిం హాసనం మీద పెట్టి పరిపాలనా బాధ్యతలను నిర్వహించమని భరతుడిని ఒప్పించారు.  దీనివల్ల రామాయణంలో పాదుకలకు ఇవ్వబడిన ప్రాముఖ్యత మనకు అర్ధమవుతుంది. భరతుడు తన శిరస్సుపై పాదుకలను పెట్టుకొని అయోధ్యకు తీసుకొని వచ్చారు. అయోధ్యకు చేరిన తరువాత, పాదుకలను సిం హాసనం మీద పెట్టి భరతుడు శ్రీరాములవారి తరఫున పరిపాలనా బాధ్యతలను చేపట్టారు.

శ్రీ సాయి సత్ చరిత్ర 5వ. అధ్యాయములో మనకు ఇటువంటివే కనపడతాయి.  

బాబా షిరిడీలో ప్రవేశించిన దానికి అనుగుణంగా బాయి కృష్ణజీ, దీక్షిత్ లు బాబా పాదుకలను షిరిడీకి తీసుకొనివచ్చి వేప చెట్టుక్రింద ప్రతిష్టించారు. 

పాలరాతి పాదుకలను వారు ఉపాసనీ మహారాజుగారి చేత ప్రతిష్టించ దలచి ఆయనను ఆహ్వానించారు.  ఉపాసనీ మహరాజు పాదుకలను 1912 వ సంవత్సరములో  శ్రావణ పూర్ణిమ రోజున వేపచెట్టుక్రింద ప్రతిష్టించి దానికి "గురుస్థాన్" అని పేరు పెట్టారు. 


బాబా అక్కడకు వచ్చి "ఇవి భగవంతుని పాదుకలు" అన్నారు.  

బాబా ఎప్పుడూ వాటిని  తన పాదుకలు అని చెప్పుకోలేదు.  "ఈ భగవంతుని పాదుకలను పూజించండి. గురు శుక్రవారములలో ఈ పాదుకలకు అగరుబత్తీలను, సాంబ్రాణి ధూపం వేసినచో భగవంతుని అనుగ్రహమును పొందగలరు" అని బాబా చెప్పారు. దీనిని బట్టి  పాదుకలకు మనము ఎంతటి ప్రాముఖ్యాన్నివ్వాలో అటు రామాయణం ద్వారా, ఇటు సాయి సత్చరిత్ర ద్వారా గ్రహించగలము.     

శ్రీ సాయి సత్చరిత్ర 43, 44 అధ్యాయముల ద్వారా భాగవతము, రామ విజయముల యొక్క గొప్పతనము తెలుస్తుంది. సాయినాధుని మహాసమాధికి వాటికి సంబంధం ఉంది. సామాన్య మానవులు జీవిత ఆఖరి క్షణాలలొ భాగవతం వింటూ మోక్షాన్ని పొందగలరు. సాధు సత్పురుషులు తమ ఆఖరి క్షణాలలో మహా సమాధి అయేముందు రామవిజయాన్ని వింటారు. శ్రీరామచంద్రులవారి అవతార పరిసమాప్తి అయేముందే రామవిజయం యొక్క ప్రస్తావన వస్తుంది. శ్రీరాములవారికి మరణం లేదు. బాబా మహా సమాధి అయే సమయములో తన భక్తుడయిన వాఝే చేత రామ విజయాన్ని చదివించుకోవడానికి బహుశా ఇదే కారణమయి ఉంటుంది. ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి శ్రీరాములవారు తన అవతారాన్ని ఎట్లా చాలించారో మనము తెలుసుకొందాము.         

శ్రీరాములవారు తన కుమారులయిన లవ కుశులకు పట్టాభిషేకం చేశారు. 



సీతామాత ఎన్నోకష్టాలను అనుభవించి ఇక తన పాత్రను ముగించుకుందామని నిశ్చయించుకొన్నది. తాను 
ఎక్కడినుంచయితే జన్మించిందో ఆపుడమి తల్లి ఒడిలోకే 
చేరుకొన్నది.
 

ఇక శ్రీరామచంద్ర్రలవారికి ఏమి మిగిలింది? లక్ష్మీదేవి అప్పటికే 
విష్ణులోకానికి వెళ్ళిపోయింది.  

ఆమె ప్రక్కన ఉండటానికి తను కూడా వెళ్ళాలి. అందరూ చూస్తుండగా, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు, నలుగురూ కూడా సరయూ నదిలోకి ప్రవేశించి అదృశ్యమయ్యారు. సరయూ నదిలోనించి, శంఖు చక్ర గదా ఆయుధాలను ధరించి ఆదిశేషునిపై పవ్వళించి శ్రీమహావిష్ణువు స్వర్గలోకానికి వెళ్ళారు. ఇదంతాకూడా రామాయణంలో వర్ణించబడి ఉంది.   

బాబా మహాసమాధి ఎలా చెందారన్న విషయం మనకు శ్రీ సాయి సత్చరిత్ర 43 - 44 అధ్యాయాలద్వారా తెలుస్తుంది. అక్టోబరు 15 వ. తేదీ 1918 సంవత్సరము విజయదశమి  మధ్యాహ్న్నము వేళ దశమి వెళ్ళి ఏకాదశి ఘడియలు సమీపిస్తున్న సమయములో  బాబా ద్వారకామాయిలో తన శరీరాన్ని త్యజించి విష్ణులోకానికేగారు.  రామాయణంలో శ్రీరామ చంద్రులవారు, శ్రీసాయి సత్చరిత్రలో బాబా ఇద్దరూ కూడా  విష్ణులోకానికి చేరుకొన్నారు.  

ఆనాటిశ్రీరాములవారే ఈనాటి  శ్రీ షిరిడీ సాయిరాములవారని తెలియచేస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. 

రామాయణంలో శ్రీసాయి సమాప్తము

త్వరలో శ్రీకృష్ణ పరమాత్మగా శ్రీసాయి ....ఎదురు చూడండి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)





సాయి బంధువులారా! మీరందరూ ఉపాసనీ మహారాజుగారు పాదుకలను గురుస్తాన్ లో  ప్రతిష్టించిన విషయాన్ని చదివారు.  ఇప్పుడు  పాదుకల ప్రతిష్ఠాపన గురించి మరింత సమాచారాన్ని మీకు అందిస్తున్నాను.  ఇది కాకతాళీయం కాదని నేను భావిస్తున్నాను.  అంతా బాబా ప్రేరణతోనే జరుగుతోంది.  రెండువారాల క్రితం ఒరిస్సానించి శ్రీ చాగంటి సాయిబాబాగారు, శ్రీమతి విన్నీ చిట్టూరిగారు ఆంగ్లంలో అళందీస్వామి, నిమోన్ కర్, సగుణమేరు నాయక్ ల గురించి,పాదుకా ప్రతిష్ఠాపన గురించి తెలుగు అనువాదం నాకు పంపించారు. నేటితో రామాయణంలో శ్రీసాయి ముగుస్తున్నందువల్ల, శ్రీసాయిబాబాగారు పంపిన తెలుగు అనువాదాలు రేపటినుంచి ప్రచురిద్దామని నిర్ణయించుకోవడం, వాటిని చూసిన తరువాత పాదుకల గురించిన సమాచారాన్ని కూడా ఈ సందర్భంలోనే ఇస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఇవ్వడం జరిగింది. పాదుకల గురించిన మరింత సమాచారం మీకు ఈ సందర్భంగా అందిస్తున్నాను, చదవండి. 
                                    @@@@@@@

శ్రీమతి విన్ని చిట్లూరి వ్రాసి స్టెర్లింగ్ పబ్లిషర్స్ వెలువరించిన ఈ క్రింది గ్రంధాల నుండి స్వేఛ్చానువాదం గా కాక యధాతదంగా అనువదించే ప్రయత్నం లో భాష కొంచెం కఠినంగా వున్నదనుకుంటాను. మీరు సంస్కరించి వీలువెంబడి బ్లాగ్ లో వెలువరించండి.

1. Baba's Rinanubhand - Leelas during His Sojourn in Shirdi
2. Baba's Anurag - Love for His Devotees
3. Baba's Vani - His Sayings & Teachings
4. Baba's Gurukul - Shirdi

శ్రీ చాగంటి సాయిబాబా గారికి నాధన్యవాదాలను తెలుపుకుంటున్నాను.                                            


                               “ఇవి భగవంతుని పాదుకలు,     
                                  
                                 వేప చెట్టుక్రింద ప్రతిష్టించండి”

                    షిరిడి లో పాదుకలు ప్రతిష్టించబడి వంద సంవత్సరాలు  
                     
                       సాయి మహిమ్నాస్తోత్ర రచన కీ వంద సంవత్సరాలు.

శ్రీసాయి సచ్చరిత 5వ అద్యాయంలో ప్రస్థావించబడిన పాదుకల వృత్తాంతాన్ని గురించిన  విశేషాలను డాక్టర్ కేశవ్ బి. గావంకార్ గారు తమ “షిలధీ” అన్న పుస్తకం లో వివరంగా వ్రాసారు కానీ సచ్చరిత కి కొద్దిగా భిన్నంగా వుంటాయావిశేషాలు. సాయి జిజ్ఞాసువులు  రెంటినీ కలిపి చదివితే చక్కటి అవగాహన కలుగుతుంది.  

ముంబాయి నివాసి డాక్టరు రామారావు కొఠారి గారు 1912 లో షిరిడి సందర్శించుకున్నారు. వారి వైద్య సహాయకుడూ (వీరి పేరు తెలియక పోవడం దురదృష్టకరం) మరొక మిత్రుడు భాయ్ క్రిష్ణ్ జీ ఆలీ బాగ్ కర్  ఎంతో కాలంగా సాయి మార్గంలో వుంటూ షిరిడీకి పలుమారులు వచ్చియున్నారు. ఆ క్రమం లోనే డాక్టర్ రామారావు కొఠారి గారితో కలసి 1912 లో షిరిడి మరొకసారి సందర్శించుకున్నారు.


సగుణ్ మేరు నాయక్, కమలాకర్ దీక్షిత్, ఆలీబాగ్ కర్ మరియు పేరు తెలియని వైద్య సహాయకుడూ ఒక సాయంకాలం కబుర్లు చెప్పుకుంటూ వుండగా వారి సంభాషణ బాబా షిరిడి లో అవతరించిన వైనం వైపుకు మళ్ళింది. సాఠేవాడాకు ఆనుకుని వున్న వేపవృక్షం క్రింద ప్రదేశాన్ని, అక్కడ బాబా కూర్చునేవారు కాబట్టి పాదుకలను ప్రతిష్టించి పవిత్రపరచాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు. వెంటనే ఆలిబాగ్కర్ కరుకగా వున్న ఒక సాధారణ రాయి తో పాదుకలు తయారు చేయించి తెచ్చాడు. ’ఈ పాదుకలను నిజంగా ఇక్కడ ప్రతిష్టించాలని అనుకుంటున్నారా? నా యజమాని అయిన డాక్టరు కొఠారి గారికీ విషయము తెలిస్తే  వారు పాలరాయి తో  పాదుకలను ఎంతో ఆనందం గా తయారు చేయించేవారే’ అని వైద్యసహాయకుడన్నారు.

డాక్టర్ కొఠారి గారి కి ఈ విషయం తెలియజేయబడింది. ఆయన పాలరాతి పాదుక ల నమూనాను తయారు చేయించి షిరిడీకి తీసికుని వచ్చారు. డాక్టర్ కొఠారి ఉపాసనీ గారికి సన్నిహితుడైనందువలన పాదుకల నమూనా చిత్రాన్ని ఆయనకు చూపి తమ ఆలోచనను తెలిపారు. ’మీ ఈ ఆలోచన చాలా గొప్పది. కేవలం వట్టి పాదుకలను మాత్రమే ప్రతిష్టించకుండా, ఆ పాదుకల పై శంఖం, చక్రమ్, గద మరియూ పద్మం నమూనాలను చెక్కించితే మరింత అందంగా వుంటుంది’ అని వారికి ఉపాసినీ గారు సూచించారు. పాదుకలను నేల మీద ప్రతిష్టించకూడదు, నలువైపులా పాలరాయి తో నిర్మించబడిన ఎత్తైన పీఠం మీద ప్రతిష్టించి, ముందుభాగంలో వేపవృక్షం పవిత్రతనూ, సద్గురు సాయబాబా వారి దర్శనం వలన కలిగే అధ్బుత అనుభూతిని గురించిన వర్ణణనూ చెక్కిస్తే బాగుంటుందని కూడా ఉపాసనీ గారు సూచించారు. డాక్టర్ కోఠారి గారు ఉపాసనీ గారి సూచనలని ఎంతో ఆనందం గా అంగీకరించారు.

శంఖ, చక్ర, గదా పద్మాలు మహావిష్ణువు తన నాలుగు హస్తాలలో ధరించి వుంటారు. శంఖంలోనుండి ప్రభవించే శబ్దం ఓంకారాన్ని పోలివుంటుంది. భగవంతుడ్ని నాదబ్రహ్మ లేదా భగవంతుడిని  శబ్దబ్రహ్మ గా సూచిస్తుంది. చక్రం సంసార చక్రానికి ప్రతీక. అలాగే గద బుద్దికీ, పద్మం స్వచ్ఛతకీ, అలౌకికమైన శాంతికి చిహ్నాలు గా పోలుస్తూవుంటారు.

ఫీఠాని కి ముందు భాగాన ఉపాసనీ గారు వ్రాసిన శ్రీ సాయినాధ మహిమానిత స్త్రోత్రం లోని ’అరుచి, చేదు అనే సహజ గుణాలను కోల్పోయి అమృతతుల్యమై, కల్పవృక్షం గా  మారిన వేపచెట్టు దిగువన నిరంతరం నివసించి వున్నటువంటి సద్గురు సాయినాధునికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను’ అనే అర్డాన్నిచ్చే 4 వ శ్లోకం “సదా నింబవృక్షస్య మూలాధివాసాత్, సుధాస్రావిణం తిక్తమప్య ప్రియంతం, తరుం కల్పవృక్షాధికం సాధయంతం, నమామీశ్వరం సద్గురుం సాయినాధం” చెక్కబడింది.  


డాక్టర్ కొఠారి పాదుకలను అందంగా పాలరాతి తో చేయించి షిరిడికి పంపారు. ఆ పాదుకలు రెండు రోజుల పాటు ఖండోబా మందిరంలో వుంచడం జరిగింది. “శ్రావణ శుధ్ధ పౌర్ణమి శుభదినాన వేపచెట్టు క్రింద యీ పాదుకలను ప్రతిష్టించవలసింద”ని బాబా ఆదేశించారు. శ్రావణ పౌర్ణమి శుభదినాన వుదయం 11  గంటలకు ఖండోబా మందిరం వద్దనుండి పాదుకలను గోవింద కమలాకర్ దీక్షిత్ తన శిరసున ధరించి వూరేగింపుగా ద్వారకామాయి వద్దకు తీసికుని వెళ్ళి బాబా పాదాల చెంత వుంచడం జరగింది. పాదుకలను తన దివ్యహస్తాలతో స్పృశిస్తూ బాబా “ఇవి భగవంతుని పాదుకలు. వీనిని వేపచెట్టు క్రింద ప్రతిష్టించండి” అన్నారు.

పాశా శేఠ్ అనే బొంబాయికి చెందిన పార్శీ భక్తుడు 25 రూపాయలను మనీ ఆర్డర్ ద్వారా ఆలీబాగ్ కర్ పేరున బాబాకు దక్షిణ గా పంపించాడు. ఈ మనీ ఆర్డర్ పాదుకల ప్రతిష్ట కు ముందురోజు న అందుకున్న ఆలీబాగ్కర్ బాబా కి అందజేసాడు. ’రేపటి పాదుకా ప్రతిష్టా కార్యక్రమానికి ధనం అవసరం పడుతుంది కదా, యీ డబ్బు వుండనీ’ అని బాబా అన్నారు. డాక్టర్ కొఠారి మాత్రం ఏమీ డబ్బు పంపలేదు.

ఉపాసనీ, జోగ్, భాటే మరియు దాదాకేల్కర్ వంటి ఎందరో భక్తులు ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిష్టకూ ఆతర్వాత సంతర్పణ కూ 100 రూపాయలు ఖర్చయింది. బాబా 25 రూపాయలు యివ్వగా, ఆలీబాగ్ కర్, వాసుదేవ్, అప్పాజీ, సాఠే మరియూ కమలాకర్లు కలిసి  75 రూపాయలు యిచ్చారు. నాలుగు వేదాలకు ప్రతీకలుగా నలుగురు బ్రాహ్మణులు కోపర్గావ్ నుండి వచ్చి, ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులందరూ ఎంతో ఆనందంతో యీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అక్కల్ కోట మహరాజ్ వారు ఆలీబాగ్ కర్ ఆరాధ్య దైవం అయినందువలన ఆలీబాగ్ కర్ అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు బాబా “అరె, అక్కల్ కోటలో ఎముందిప్పుడు? అక్కడికి యెందుకు వెడుతున్నావు? స్వామీ సమర్ధ షిరిడీ లోనే యిక్కడే కొలువైవున్నారు” అనడంతో భాయి ఆలీబాగ్ కర్ అక్కల్ కోటకు వెళ్ళడం మానుకుని, అప్పటినుండి షిరిడికి తరచుగా వస్తూవుండేవాడు.
(ఈవివరాలన్నీ డాక్టర్ కే.బీ.గావన్ కర్ గారు వ్రాసిన ’శిలధీ’ అను పుస్తకం నుండి సేకరించి షిరిడి నివాసిని విన్నీ చిట్లూరి గారు “బాబా’స్ గురుకుల్ షిరిడి” – స్టెర్లింగ్ పేపర్ బ్యాక్స్, న్యూఢిల్లీ, 2009 - అనే ఆంగ్లపుస్తకంలో ప్రచురించారు. సాయి జిజ్ణాసులకు వుపయుక్తమవుతుందన్న వుద్దేశ్యంతో అనువదించబడిన ఈ వ్యాసం లో ఏమైనా పొరపాట్లు వుంటే, నా అనువాదం లోనె లోపం గానీ, డాక్టర్ గావన్కర్ గారు కానీ, విన్నీ చిట్లూరి గారు కానీ ఎంత మాత్రం భాద్యులు కారు అని సవినయంగా మనవి చేసికుంటున్నాను).

శ్రీసాయి సచ్ఛరిత మూల గ్రంధం (పోతీ) లో మాత్రం పాదుకలను గురించి న వివరాలు 51వ ఒవీ నుండి 60వ ఒవీ వరకూ ఈక్రింది విధంగా ప్రస్తావించబడింది. (శ్రీ సాయి సత్చరిత, తెలుగు, ఒవి నుండి ఒవి, అనువాదం: మణెమ్మగారు, సద్గురు సాయిబాబా మందిర్, కిషన్ బాగ్, హైదరాబాద్)
51. ఇక్కడే వేపచెట్టు క్రింద “భాఈ” అను ఒక భక్తుడు అక్కల్ కోట స్వామి యొక్క పాదుకలను సాధకులు పూజించాలనే ఉద్దేశ్యంతో స్థాపించాడు.
52. అతడు తన ఉపాస్య దైవమైన స్వామివారి పాదుకలను అక్కల్ కోటస్వామి సమర్ధ పటాన్ని నిత్యం నియమ నిష్టలతో పూజించేవాడు. 
53. అక్కల్ కోట వెళ్ళి స్వామి వారి దర్శనం చేసికోవాలనీ, భక్తిగా పూజోపచారాలను సమర్పించుకోవాలని అతనికి సంకల్పం కలిగింది.
54. ముంబాయి నుండి బయలుదేరాలని ప్రయాణానికి సిద్ధం చేసికుని అక్కడికి ఆ మరునాడు వెళ్ళాలన్న నిశ్చయం మారి షిరిడి మార్గం పట్టాడు.
55. కారణం అతడు ప్రయాణమవ్వాలని తలచిన ముందురోజున అతనికి స్వప్నంలో ’ప్రస్తుతం నా స్థానం షిరిడి లో, నీవు అక్కడికి వెళ్ళు’ అని స్వామి సమర్ద ఆదేశించారు.
56. వారి ఆదేశాన్ని శిరసావహించి ముంబయి నుండి ప్రయాణమై షిరిడి వెళ్ళి అక్కడ ఆరు నెలలు ఆనందంగా గడిపే భాగ్యాన్ని పొందాడు.
57. పూర్ణనష్ఠావంతుడైన భాఈ తనకు కలిగిన ఈ దృష్టాంతం చిరస్మరణీయంగా ఉండాలని వేపచెట్టుక్రింద పాదుకలను స్థాపించాడు.
58. శక సంవత్సరం 1834 లో శ్రావణ మాసం, శుక్లపక్ష పర్వకాలంలో స్వామి పాదుకలను వేప చెట్టు క్రింద భక్తి శద్ధలతో స్థాపించాడు.
59. ఒక శుభముహుర్తాన దాదా కేల్కర్ చేతుల మీదుగా విధివిధానాలతో శాస్త్రోక్తం గా ఉపాసనీ మహరాజ్ స్వయంగా పాదుకలను స్థాపింపచేసారు.
60. తరువాత ఈ పాదుకల పూజావ్యవస్థను బ్రాహ్మణుడైన దీక్షిత్ చేసేవాడు. ఇతర ఏర్పాట్లను సగుణ్ మేరు నాయక్ చూసేవాడు.
తొలిరోజుల్లో కమలాకర్ దీక్షిత్, తదుపరి ఎల్.కె.జాకడి మంగళస్నానం, నిత్యపూజనిర్వహించేవారు. ప్రస్తుతం సంస్థాన్ తరపు పూజారి వీనిని నిర్వహిస్తున్నారు. 2007 లో వెండి పాదుకలను 5” ఎత్తుగల వేదికపై ప్రతిష్టించడం జరిగింది.

విన్నీచిట్లూరి గారి ’బాబాస్ గురుకుల్, షీరిడి’ ప్రకారం గురుస్థాన్ గా ప్రఖ్యాతి పొంద్ది్, భక్తులు వారివారి కర్మ వినాశనానికి, ఆద్యాత్మిక అభ్యున్నతికి, కోరికల సాధనకూ ప్రదక్షిణ చేసే ఈ ప్రదేశం లో 1920 నాటికి వేపచెట్టు కి ఆనుకుని పశ్చిమ ముఖంగా చిన్నగుడి వుండేది. 1941 లో ఆశ్వయుజ శుద్ధ దశమిరోజున అంటే 30.9.1941 న ఆ చిన్నమందిరం రాగితో చెక్కిన నెమళ్ళ, పువ్వల బొమ్మలతో, ప్రకాశవంతమైన రంగులతో అందమైన మందిరంగా ఒక అడుగు వేదికపై పునర్నిర్మించబడింది. గోపురం పైన చిన్న కలశం కూడా వుండేది. 1974లోఅందమైనఈచిన్నమందిరం పెద్ద మందిరంలోని కి పరివేష్టించబడింది. చిన్నమందిరానికి కుడివైపున బాబా విగ్రహం వుంచబడింది, ఎడమవైపున వేపచెట్టు వుండేది. పాలరాతి పాదుకలు వేపచెట్టు ఎదురుగా ఒక వేదికపై వుండేవి. రాయి మీద కూర్చుని వున్న బాబా మూడు అడుగుల ఈ విగ్రహాన్ని ముంబాయి చెందిన యశ్వంతరావ్ డి.దవే అను భక్తుడు సమర్పించాడు. సమాధి మందిరంలో వున్న విగ్రహాన్ని చెక్కిన దివంగత బాలాజీ వసంత్ తాలీమ్ కుమారుడు హరీష్ బాలాజీ తాలీమ్ ఈ విగ్రహాన్ని చెక్కారు. 

2007 ఏప్రెల్ ప్రాంతంలో ఈవేప చెట్టు ఎండిపోతున్న పరిస్థితిని గమనించిన సాయిబాబా సంస్థాన్ వారు ఉద్యానవన శాఖవారి సహాయాన్ని అర్దించారు. వేపచెట్టుకి మూలాలకి, వేరులకీ కావల్సిన నీరు, ప్రాణవాయువు, పోషకాలూ లభించేందుకు వీలుగా గురుస్థాన్ మరుయూ ఆ మందిరమూ తొలగించి, గురుపూర్ణిమ చాలా త్వరలో వస్తున్నందువలన ప్రస్తుతం వున్న గురుస్థాన్ నిర్మించడం జరిగింది. 

శ్రీ సాయి సఛ్చరిత భారతదేశం లోని చాలా భాషలలోనికి అనువదించబడింది. ఈ అనువాదాలన్నిటికీ శ్రీ నాగేశ్ వాసుదేవ్ గుణాజీ ఆంగ్లంలోకి సంక్షిప్తీకరించిన అనువాదమే మూలం. బహుశ సంక్షిప్తీకరణ కారణం గానే శ్రీ గుణాజీ ఆంగ్ల అనువాదం మక్కీకి మక్కీగా కాక స్వేఛ్చానువాదంగా కొనసాగుతుంది. తెలుగు లో శ్రీ ప్రత్తి నారాయణరావు గారి గ్రంధం కూడా గుణాజీ ఆంగ్లాని కి అనువాదమే. అందువలనే పాదుకల వృత్తాంతం చివరన ’హేమాఢ్ పంతునకీ వివరములు తెలిసియుండవు. తెలిసి యున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు’ అని ప్రస్తావించబడింది.

శ్రీ బి.వి.దేవ్ గారు సేకరించి శ్రీ సాయి లీల మాస పత్రిక రెండవ సంపుటము, మొదటి సంచిక, 25 వ పేజీలో ప్రచురించిన వివరాల (శ్రీసాయి సచ్చరిత్ర, తెలుగు, శ్రీ ప్రత్తి నారాయణరావు) ను అనుసరించీ మరియూ డాక్టర్ గావన్కర్ గారందించిన  వివరాలను బట్టీ షిరిడి లో గురు పాదుకల ప్రతిష్ట జరిగి ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి కి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి (2.8.2012) గురువారం కావడం సద్గురు కృపకాక మరేమిటి? 
చాగంటి సాయిబాబా
సాయి దయాల్ విహార్
జట్నీ, ఒడిషా. 

                                                                 


                                   

                                                                 





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List