Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, March 9, 2013

పుణ్యభూమిశిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 9వ.అధ్యాయం

Posted by tyagaraju on 7:44 AM
                          


                                          
                                              
 

09.03.2013  శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత వారం రోజులుగా స్వస్థలంలో లేకపోవడం వల్ల ప్రచురణకు అంతరాయం కలిగింది.  ఈ రోజు పుణ్యభూమిశిరిడీ లో దొరికిన రత్నమణి సాయి 9 వ.అధ్యాయం చదవండి.
శ్రీవిష్ణుసహస్ర నామం శ్లోకం మరునాడు యధావిధిగా అందిస్తాను.

సాయి బంధువులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు

ముందుగా శివోహం వినండి.  


http://www.raaga.com/play/?id=37205

(ఇపుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన శివోహం వింటు అర్ధాన్ని కూడా తెలుసుకోండి)

 http://www.youtube.com/watch?v=br29S_GBBjQ

పుణ్యభూమిశిరిడీలో   దొరికిన రత్నమణి సాయి - 9వ.అధ్యాయం 


9వ.అధ్యాయము

                                                                                                                                  14.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈ అధ్యాయములో హేమాద్రిపంతు ఆ రోజులలో శ్రీసాయి భక్తులకు జరిగిన అనుభవాలు వివరించినారు  నాకు ప్రత్యేకమైన అనుభవాలు జరగలేదు. 



కాని భిక్ష యొక్క ఆవస్యకత చదివిన తరువాత ఒక విషయము నీకు వ్రాయాలి అని అనిపించుతున్నది.  05.10.91 నాడు రాత్రి కలలో శ్రీసాయి నాకు జన్మ ఇచ్చిన తల్లి రూపములో ఒక మశీదు ప్రక్కన నిలబడి నాకేసి చూస్తున్నారు.  ఆ మశీదు ప్రక్కన ఒక కాళ్ళు లేని ముష్ఠివాడు దీనంగా సాయిబాబా పేరిట దానం చేయమని అడుగుతున్నాడు.  నేను నాతల్లిని చూస్తున్నాను.  నాతల్లి (నీ మామ్మ) నాకేసి చూసి ఏమిటి అలాగ నిలబడ్డావు.  ఈరోజు శనివారము.  ఆబీదవాడికి కొంచము బియ్యము దానం చేయకూడదా అని నన్ను ఆదేశించినది. నాకు నిద్రనుండి తెలివి వచ్చినది.  ఆరోజునుండి శ్రీసాయి సత్ చరిత్ర నిత్యపారాయణ చేసిన తర్వాత ఒక పిడికెడు బియ్యము శ్రీసాయి పేరిట యింటిలో ఉన్న జోలెలో వేస్తు బీదలకు అన్నదానానికి, శ్రీరామనవమి నాడు సాయి భక్తులకు ప్రసాదానికి, విజయదశమినాడు సాయి భక్తులకు ప్రసాదానికి ఆ బియ్యము వాడుతున్నాను.  శ్రీసాయి ఈవిధముగా నన్ను అన్నదానము చేయమని ఆదేశించినారు అని నానమ్మకము.  ఈనమ్మకాన్ని నాజీవితము అంతము వరకు నిలబెట్టుకోవటానికి శ్రీసాయి నాకు శక్తిని ప్రసాదించగలరని నమ్ముతున్నాను.  ఈ తొమ్మిదవ అధ్యాయము ఆఖరిలో శ్రీహేమాద్రిపంతు నీతిని వ్రాసినారు.  "భగవంతుని జీవులన్నిటియందు గనుము"

ఈ విషయములో నేను పొందిన అనుభవాలు వ్రాస్తాను.  ఈ అనుభవాలు నాకు 1991 సంవత్సరములో జరిగినవి.  అది వేసవికాలము మధ్యాహ్న్నము ఎండ విపరీతముగా యున్నది.  నేను యింటినుండి బయటకు వెళ్ళుతున్నాను.  గుమ్మములో మురికి కాలవ యున్నది.  ఒక తెల్లని ఎద్దు దాహానికి ఆమురికి కాలవలోని నీరు త్రాగుతున్నది.  మనసులో బాధ అనిపించినది.  శ్రీసాయి ఆరూపములో యింటి ముందు వచ్చి యుంటారు అనే ఆలోచన కలిగినా నేను ఏమీ పట్టించుకోకుండ (కనీసము బకెట్టు మంచినీరు కూడా యివ్వలేదు) నేను నాపని మీద వెళ్ళిపోయినాను.  మరుసటి రోజున నేను భోపాల్ పనిమీద వెళ్ళి వస్తూ దారిలో విపరీతమైన దాహము బాధతో ఒక స్టేషన్ లో మజ్జిగ కొని త్రాగినాను.  ఆ దుకాణమువాడు ఒక బకెట్టులోని మురికి నీరుతో త్రాగిన గ్లాసులు కడుగుతూ వాటిలో తిరిగి మజ్జిగ పోసి రైలు ప్రయాణీకులకు అమ్ముతున్నాడు.  ఆమజ్జిగ త్రాగిన తర్వాత నాలో పశ్చాత్తాపము కలిగినది.  నాయింటిముందు సాయినాధుడు విపరీతమైన దాహముతో మురికి నీరు త్రాగుతున్నపుడు నేను కనీసము ఒక బకెట్టు మంచినీరు కూడా యివ్వలేక పోయినాను అని బాధపడినాను.  అబాధ నాలో పరివర్తనకు దారి చూపినది.  ఆసంఘటన *మన యింటిముందు పశువులు నీళ్ళు త్రాగటానికి ఒక నీళ్ళ తొట్టి ఏర్పాటు చేయడానికి కారణమైనది.  యిక 1991 సంవత్సరము దీపావళినాడు జరిగిన సంఘటన వ్రాస్తాను.

ఆరోజు దీపావళి.  రాత్రి 8 గంటల ప్రాంతములో మన మేడమీద గదిలో నేను, మీ అమ్మ లక్ష్మి పూజ చేస్తున్నాము. పూజారి మంత్రాలు చదువుతున్నారు.  నామనసు గోడమీద ఉన్న సాయిబాబా ఫొటో పై లగ్నము అయ్హినది.  లక్ష్మి పూజ చేస్తున్నా శ్రీసాయి ఆశీర్వచనాలు కావాలని నామనసు కోరుతున్నది.  శ్రీసాయి తన భక్తుల కోరికను ఎప్పుడు కాదనలేదు అని నిరూపించడానికి అయి ఉంటుంది.  శ్రీసాయినాధుడు ఒక చక్కటి ఊదారంగులో ఉన్న కప్ప రూపములో నాపాదాల దగ్గరలో గెంతుతున్నారు.  ఒక్కసారి మనసు సంతోషముతో ఉక్కిరిబిక్కిరి అయినది.  శ్రీసాయి స్వయముగా అన్నమాటలు "నీ భోజనమునకు పూర్వము ఏ కుక్కను చూచి రొట్టై పెట్టితివో అదియు నేను ఒక్కటియే, అటులనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియూ నాంశములే.  నేనే వాని యాకారములో తిరుగుచున్నాను. ఎవరయితే జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు.  కాబట్టి నేనొకటి, తక్కిన జీవరాశి యింకోటియను ద్వంద్వ భావమును, భేదమును విడిచి నన్ను సేవింపుము"".  నిజము అని గ్రహించగలిగినాను.  ఒకవేళ అది వర్షాకాలము అందుచేత కప్ప గదిలోనికి వచ్చియుండ వచ్చును అని ఎవరైన అంటే ఒక ముఖ్య విషయము చెప్పాలి. ఆనాడు దీపావళి.  ఆరోజు వాన కురియలేదు.  అంతకుముందు పదిరోజులులోను వాన కురియలేదు.  మరి పూజ జరుగుతున్నది మేడమీద గదిలో.  మరి ఆకప్ప ఎక్కడనుండి రాగలదు.  శ్రీసాయినాధుడు మాత్రమే ఆకప్ప రూపములో నాకోరిక తీర్చటానికి దర్శనము యిచ్చినారు అని నా నమ్మకము.

ఇపుడు 22.11.1991 నాడు జరిగిన యింకొక సంఘటన వ్రాస్తాను.  ఆరోజు నిత్యపారాయణ లోని శ్రీసాయి సందేశము ప్రకారము సికింద్రాబాద్ లోని శ్రీపాండురంగ విఠల్ గుడికి వెళ్ళినాను.  నేను గుడి దగ్గరకు వెళ్ళుతుంటే ఒక కుక్క కుంటుకుంటు నావెనకాల గుడివరకు వచ్చి గుడి బయట నిలబడిపోయినది.  నేను దానివైపు జాలిగా చూసి గుడి లోపలికి వచ్చినాను.  పూజారి గుడిలో లేరు.  అక్కడ యున్న పనివాడితో పూజారి గురించి కబురు చేసినాను.   ప్రతిసారి యుండే పూజారి బదులు ఆరోజున పూజారి కుమారుడు కుంటు కుంటు (పోలియో వ్యాధిగ్రస్తుడు) గుడిలోనికి వచ్చి అర్చన చేసినారు.  ఆసమయములో నాకంటికి శ్రీసాయినాధుడు శ్రీపాండురంగ విఠల్ లోను, అర్చన చేస్తున్న కుంటి పూజారిలోను, గుడి బయట కుంటి కాలుతో నిలబడియున్న కుక్కలోను కనిపించినారు.  ఈ సంఘటనతో శ్రీసాయి అన్నమాటలు "నేనొకటి, తక్కిన జీవరాశి యుంకోటి యను ద్వంద్వ భావమును భేదమును విడిచి నన్ను సేవింపుము" యివి అక్షర సత్యాలు.

శ్రీసాయి సేవలో

 నీతండ్రి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

(*సాయి.బా.ని.స. మంచి మనసుతో పశువులు నీరు త్రాగడానికి తొట్టెను బయట కట్టించి అందులో నీరు పోసేవారు.  కాని చుట్టుపక్కలవారు ఆతొట్టెలోనికి చెత్తను  పాత చీపురు కట్టలు, పాత చెప్పులు, కోడిగ్రుడ్డు డొల్లలు వేయడం ప్రారంభించారనీ, తరువాత మునిసిపాలిటీవారు తూము కట్టడానికి అడ్డముగా ఉన్నదని కూలదోసారని వారు నాకు మాటల సందర్భంలో చెప్పడం జరిగింది. వారు నాకు చెప్పడం జరిగింది.  దీనిని బట్టి మనకు ఏమని అర్ధమవుతున్నదో మీరే ఊహించుకోండి.  --  త్యాగరాజు 

(09.03.2013)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List