17.02.2026 మంగళవారమ్
ఓం సాయి శ్రీ సాయి జయయయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు. (సెప్టెంబరు, అక్టోబరు, 2025 సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)
శ్రీ సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు
శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.
శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు… 6 వ.భాగమ్
మరాఠీ నుండి ఆంగ్లానువాదం.. షంషాద్ మీర్జా
తెలుగు అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్ -- 9440375411 & 81436267
ఈ మెయిల్.. tyagaraju.a@gmail.com
సంక్షోభ సమయంలో ప్రయాణ ప్రారంభమ్
అది 1918 వ.సం. పూనా పట్టణమంతా భయం గుప్పిట్లో చిక్కుకుంది. ఫ్లూ అంటువ్యాధి ప్రజలందరి మీదా తన పంజా విసురుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. ప్రజలందరూ ప్రాణాలను అరచేతులో పెట్టుకుని రక్షణకోసం పెనుగులాడుతూ ఉన్నారు.
ఇటువంటి పరిస్థితిలో మేము మన్నోడ్ కు బయలుదేరడానికి నిర్ణయించుకున్నాము. అక్కడ మా నాన్నగారు జడ్జీగా పనిచేసారు. ఆ సమయంలో నా మనసులో ఒక ఆలోచన మెల్లగా ప్రవేశించింది. “మనం షిరిడి వెళ్ళి మన సాయిబాబా గారి దర్శనం చేసుకోగలమా?”
కాని నేను కాస్త సంకోచించాను. మా పెదనాన్నగారు మాతో ప్రేమగానే ఉంటారు. అయినప్పటికీ ఆయనది ఖచ్చితమయిన మనస్థత్వం. ఆయనతో మాట్లాడటానికి నాకు ధైర్యం చాలలేదు.
సంతోషకరమయిన విషయం ఏమిటంటె నా మేనత్తలిద్దరూ కూడా ఇదే ఆలోచనతో నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకు కూడా షిరిడీ సాయిబాబాగారిని దర్శించుకోవాలని ఉంది. మా పెదనాన్నగారితో ఆ విషయం చెప్పమని నన్నడిగారు. నేను మా పెదనాన్నగారితో మాకు షిరిడి వెడదామని ఉంది అన్నాను. బాబా దయవల్ల ఆయన ఇంకేమీ అడ్డు చెప్పకుండా వెంటనే ఒప్పేసుకున్నారు.
మేము ప్రయాణం ఏవిధంగా చేయాలో ఒక పద్ధతిగా ప్రణాళిక వేసుకున్నాము. సెప్టెంబరు 29, 1918, ఆదివారం సాయంత్రం పూనేనుండి దౌండ్ మీదుగా మన్మాడ్ వెళ్లడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము.
మేము అనుకున్న ప్రకారం మా ప్రయాణం ప్రారంభమయింది. కాని రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. మేమెక్కిన బోగీ ప్రయాణీకులతో బాగా కిక్కిరిసిపోయి ఉంది.
మేము దౌండ్ చేరుకునేటప్పటికి రాత్రి పది గంటలయింది. అప్పటికే మేము ఎక్కవలసిన తరువాతి రైలు వెళ్ళిపోయింది. తెల్లవారుజామున మేము మన్మాడ్ వెళ్ళే రైలు ఎక్కినపుడు టికెట్ కలెక్టర్ వచ్చి మేమెక్కిన బోగీ మిలటరీ వాళ్లకోసం ప్రత్యేకించినది అని చెప్పి మమ్మల్ని దించేశాడు.
ఎక్కడికి వెళ్లడానికి లేదు, కూర్చోడానికి ఎక్కడా చోటు కూడా లేదు. ఇక నిరాశతో ఒక నిట్టూర్పు విడిచాను. ఇక షిరిడీకి వెళ్ళే ఆలోచనను విరమించుకుంటె మంచిది అనిపించింది. కాని మనసులో పూర్తిగా ఒక ఆశ మాత్రం మెదులుతూనే ఉంది. ఆశ ఉన్నా గాని ఇక ప్రయాణం మానివేద్దామనే నిర్ణయం తీసుకోవడానికి ముందు, అంతకు ముందు వచ్చిన టికెట్ కలెక్టరే మళ్ళీ మా వద్దకు వచ్చి, “మీ అందరికోసం సీట్లు ఏర్పాటు చేసాను. నాతో రండి మిమ్మల్ని కూర్చోబెడతాను” అన్నాడు.
మమ్మల్ని మరొక కొత్త బోగీ దగ్గరకు తీసుకువెళ్ళి అందులో కూర్చోబెట్టాడు. ఇక మేము హాయిగా ఊపిరి పీల్చుకుని ప్రశాంతంగా కూర్చొన్నాము.
తరువాత బాబాగారి దర్శనమ్….తరువాతి సంచికలో
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)




