19.02.2026 గురువారమ్
ఓం సాయి శ్రీ సాయి జయయయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు. (సెప్టెంబరు, అక్టోబరు, 2025 సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)
శ్రీ సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు
శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.
శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు… 7 వ.భాగమ్
మరాఠీ నుండి ఆంగ్లానువాదం.. షంషాద్ మీర్జా
తెలుగు అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్ -- 9440375411 & 81436267
ఈ మెయిల్.. tyagaraju.a@gmail.com
బాబాగారి దివ్య దర్శనమ్
సోమవారం మధ్యాహ్నానికి మేము షిరిడీ చేరుకొన్నాము. మొట్టమొదటగా మేము శ్రీ బి.ఎస్.కాకాసాహెబ్ దీక్షిత్ గారిని కలుసుకున్నాము. ఆయన మాకు వాడాలో ఉండటానికి వసతి కల్పించారు.
ఆ తరువాత మేము పూజా సామాగ్రితో బాబాను దర్శించుకోవడానికి మసీదుకు బయలుదేరాము.
బాబా మవునంగా కూర్చొని ఉన్నారు. బాబా జ్వరంతో బాధ పడుతూ అలసటగా ఉన్నారు. కాని ఆయన సమక్షంలో ఎప్పటిలాగే ఎంతో దివ్యమయిన ప్రశాంతత లభిస్తూనే ఉంది. నేను ఆయన పాదాలకు ప్రణమిల్లాను. నా మనస్సుకి ఎంతో ఆనందం కలిగింది. ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోయినా మమ్మల్ని షిరిడీలో ఉండటానికి అనుమతించారు.
ముందుగా అనుకోలేదు, కాని ఆహ్వానం….
ఆ రోజు సాయంత్రం నేను ముక్తారాంజీ గారిని కలుసుకొన్నాను. ఇంతకు మునుపెన్నడూ మేము కలుసుకుని మాట్లాడుకోనప్పటికీ ఆయన నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించారు. “మీరు ఈ సమయంలో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది.”
నాకప్పుడు ఆయన అన్న మాటలలోని అర్ధం బోధపడలేదు. తరువాత తొందరలోనే నాకర్ధమయింది. మరుసటిరోజు మంగళవారం. మేము షిరిడీలోనే ఉన్నాము.
ఆసమయంలో బాబాగారి అనారోగ్యం మాహృదయాలను కలచివేస్తూ ఉంది. ఆరోజు రాత్రి ఆయన చావడి ఉత్సవానికి రాలేదు. మా తిరుగు ప్రయాణం గడువు రోజు ముగిసిపోయినా మేము షిరిడీలోనే ఉండిపోయాము.
ఆఖరికి బుధవారం ఉదయం షిరిడి నుండి తొందరగానే బయలుదేరదామనుకున్నాము. మా మేనత్తగారు తొందరగా పూర్తయే వంటకాలు బేసన్ భాత్ గాని, దాషామీ గాని (మహారాష్ట్ర వంటకాలు) తయారు చేస్తోంది. (ఈ వంటకాల వీడియోలు ఇచ్చాను, చూడండి, మహారాష్ట్ర వంటకాలు మనకు తెలియవు కాబట్టి వాటిని నేను కూడా తెలుసుకుని మీకు వివరించాలనే నా ప్రయత్నం. దాషామి రోటీ మసాలా మరియు తీపిది కూడా ఉంది. ఉన్నదున్నట్టు రాస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం. త్యాగరాజు)
కాని నేను ఉదయం స్నానం చేసి వస్తూ ఉంటే దారిలో పాలు అమ్మే వ్యక్తి కనిపించాడు.
నేను కొందామనుకున్నదానికంటే చాలా ఎక్కువగానే అతను మాకు పాలు పోసాడు. పాలు ఎక్కువగా వచ్చినందువల్ల మా మేనత్త ముందు అనుకున్న వంటకాల బదులు పాయసం చేద్దామనుకుంది. పాయసంలో సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి బాబాకు సమర్పించింది.
కాస్త పొదుపుగా తయారు చేద్దామనుకున్న వంటకం దివ్యమయిన ప్రసాదంగా మారింది. నిజం చెప్పాలంటే బాబాగారే ఆ మార్పు చేయించారు.
బయలుదేరే ముందుగా సూచనలు, ఆలోచనలు….(తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)




0 comments:
Post a Comment