Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, November 16, 2020

గాడ్గే మహరాజ్

Posted by tyagaraju on 4:28 AM




16.11.2020  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

కార్తిక మాస శుభాకాంక్షలు

ఈ రోజు గాడ్గిల్ మహరాజ్ గారి గురించిన ఒక అధ్భుతమయిన విషయాన్ని గురించి ప్రచురిస్తున్నాను.  కొన్ని సంవత్సరాల క్రితం శ్రీ షిరిడీ సాయిబాబాతో తర్ఖడ్ కుటుంబంవారికి కలిగిన అనుభవాలను ప్రచురించాను.  అందులో గాడ్గిల్ మహరాజ్ గారి గురించి సాయి భక్తులు చదివే ఉంటారు.  ఇప్పుడు ఆయన గురించి మరొక ఆసక్తికరమయిన విషయం.  షిర్డీసాయి ట్రస్ట్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది.

తెలుగు అనువాదమ్   ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

గాడ్గే మహరాజ్

నానా సాహెబ్ రాస్నే గారు గాడ్గే మహరాజ్ గారి జీవితంలో జరిగిన ఒక ఆసక్తికరమయిన విషయాన్ని వివరించారు.  దానినే మరలా ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు మరొక్క సారి మనందరికి వివరిస్తున్నారు.  శ్రీ సాయిబాబావారి అనుగ్రహం పొందినవారిలో దామోదర్ రాస్నేగారు కూడా ఒకరు.  ఆయన కుమారుడయిన నానాసాహెబ్ రాస్నేగారి ఇంటికి ఒకసారి గాడ్గే బాబా వచ్చారు. 


“ఇంతవరకు నేను ఎవరికీ చెప్పని కొన్ని విషయాలను నీకు వెల్లడిస్తున్నాను.  నేను రజకుల కుటుంబంలో జన్మించాను.  నేను చాలా పేదవాడినవటం వల్ల షేడ్ గావ్ లోని ఒక బట్టల దుకాణంలో పనికి చేరాను.  ఒకసారి సేలూ మన్వంత్ నుంచి ఒక ఫకీరు వచ్చి భిక్ష అడిగాడు.  ఆ ఫకిరు ఒక ముస్లిమ్ అనే అభిప్రాయంతో ఎవరూ భిక్ష ఇవ్వలేదు.  ఆ ఫకీరును చూసిన వెంటనే నాకెందుకో ఆయన సేవ చేయాలనే కోరిక బలంగా కలిగింది.  వెంటనే ఇంటికి వెళ్ళి ఆఫకిరు కోసం కొంత ఆహారం తీసుకువచ్చాను.  కాని నేను వచ్చేటప్పటికి ఆఫకీరు అప్పటికే వెళ్ళిపోయాడు.  ఆ ఫకీరు కోసం చాలా చోట్ల వెదికాను.  చివరికి ఆయన ఒక మొక్కజొన్న తోటలో మొక్కజొన్న కండెను తింటూ కనిపించాడు.  నన్ను చూడగానే గట్టిగా అరుస్తూ “ఎందుకొచ్చావు ఇక్కడికీ?” అన్నాడు. 

“మీకోసం  భోజనం తీసుకువచ్చాను” అని సమాధానమిచ్చాను.

అపుడా ఫకీరు “ అయితే నేనేది అడిగినా ఇస్తావా?” అన్నాడు.

“నేను బీదవాడిని కాబట్టి నాదగ్గర డబ్బు లేదు.  డబ్బు తప్ప నాజీవితంలో ఏది అడిగినా ఇస్తాను” అన్నాను.

“అయితే నీప్రాణాలియ్యి” అన్నాడు ఫకిరు.

“ఇప్పటికే నా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి.  ఎప్పుడో ఇచ్చేసానవి” అని

“వెంటనే నాప్రాణాలను తీసుకుంటారా తీసుకోండి.  నాకు జీవితేఛ్చలేదు” అన్నాను.

వెంటనే ఫకీరు నన్ను తన దగ్గరకు తీసుకొని తన చేతులను నాతలపై ఉంచి నన్ను ఆశీర్వదించాడు.  

ఆ క్షణంలో  నాశరీరంలో విద్యుత్ శక్తి ప్రవేశించినట్లయింది.  ఇక ఈప్రపంచంతో బంధం వదిలేయాలనిపించింది.  ఆఫకీరుకు భోజనం పెట్టిన తరువాత నానిర్ణయాన్ని నాకుటుంబ సభ్యులందరికీ చెప్పడానికి ఇంటికి వెళ్ళాను.  నాకు ఒక గొప్ప గురువు దొరికాడనీ, నేను ఆయనతో కూడా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నానని అందరికీ చెప్పాను.  తరువాత మరలా ఫకీరు వద్దకు వచ్చాను.   అతను చాలా కోపంగా ఉన్నాడు.  “దుర్మార్గుడా,  నేను నీకిచ్చినది సరిపోలేదా?  ఇంకా కావాలా నీకు?” అని నామీద గట్టిగా అరిచాడు.  “మీరు లేకుండా నేను బతకలేను” అని సమాధానమిచ్చాను.  నా సమాధానానికి సంతృప్తి చెంది ఫకీరు నన్ను దగ్గరలో సమాధులు ఉన్న స్థలానికి తీసుకు వెళ్లాడు.  అక్కడ ఒక ముస్లిమ్ సాధువు సమాధి ప్రక్కన గొయ్యి తవ్వమని చెప్పాడు  గొయ్యి తవ్విన తరువాత అందులో రెండు కడవలనిండా నీరు తీసుకువచ్చి పోయమన్నాడు.  నీళ్ళు పోసిన తరువాత ఫకీరు మూడు దోసిళ్ళనిండా అందులోని నీటిని త్రాగి నన్ను కూడా అదే విధంగా త్రాగమన్నాడు.  నీరు త్రాగిన వెంటనే నన్ను నేను మర్చిపోయాను.  యోగసమాధి స్థితిలోకి వెళ్ళాను.  ఆస్థితిలో నేను చాలాసేపు ఉన్నాను.  అక్కడినుండి ఫకీరు ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలీదు.

ఆ ఫకీరు ఎక్కడ ఉన్నాడో వెదుకుతూ చాలా సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాను.  అలా తిరుగుతూ షిరిడికి చేరుకొన్నాను.  అక్కడ మసీదులోకి ప్రవేశించాను.  మసీదులో తెరలు కట్టిఉన్నాయి.  లోపల ఒక ఫకిరు స్నానం చేస్తున్నారు.  నేను లోపలికి తొంగి చూసాను.  ఇన్ని సంవత్సరాలుగా నేను వెదకుతున్న ఫకీరే ఆయన.  ఆయన నావైపు చూసి, “వెధవా!  ఇప్పటికే నావంట్లోని మాంసమంతా తినేశావు.  ఇపుడు నాఎముకలను కూడా తిందామని వచ్చావా? ఇక నన్నువదలిపెట్టవా?” అని గట్టిగా అరిచారు.

“నేను మిమ్మల్ని వదలి వెళ్లను” అని సమాధానమిచ్చాను.

నా సమాధానం విని ఆఫకీరు విపరీతమయిన ఆగ్రహంతో నామీదకి ఒక ఇటికను విసిరారు.  అది నానుదుటికి తగిలి రక్తం కారసాగింది  నేను క్రిందకు పడిపోయాను.  అపుడా ఫకిరు నాదగ్గరకు వచ్చి నాకు తగిలిన గాయాన్ని శుభ్రం చేసారు.  ఆయన నాచుట్టూ తిరిగి “ఇక నువ్వు వెళ్లవచ్చు.  నువ్వు ఇపుడు మారిన మరో మనిషివి” అని దీవించారు.  ఆఫకీరు మరెవరో కాదు మహిమాన్వితుడయిన సద్గురువు సాయిబాబా…

ఆవిధంగా ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు గాడ్గే బాబాగారి జీవితంలో సంభవించిన సంఘటనలను వివరించారు.  సాయిబాబా షిరిడీలో రెండవసారి 1856వ.సంవత్సరంలో చాంద్ పాటిల్ పెండ్లివారితో కలిసి పరిపూర్ణమయిన విశిష్ట గురువుగా ప్రవేశించినపుడు బాబా చేసిన అధ్భుత లీల.   సాయిబాబా కాలాతీతులు,, సర్వాంతర్యామి.

గాడ్గే మగరాజ్ నిరంతరం “గోపాలా, గోపాల దేవకీ నందన గోపాలా” అని పాడుతూనే ఉండేవారు.  ముందురోజులలో ఆయన బికారిగా ఉన్న సాదువు.  ఆయనకు ఒక మట్టికుండ మాత్రమే ఉండేది.  కాని దర్మకార్యాల కోసం ఒక భవనం ఉంటే బాగుండుననే కోరికి ఉండేది.  పండరీపురంలో ‘ధర్మశాల’ ను తాను అనుకున్నట్లుగానే నిర్మించారు.  అదేవిధంగా నాసిక్ లో కూడ ఒక  ధర్మశాల నిర్మాణం ప్రారంభించారు.  కొన్ని గదులు కట్టిన తరువాత డబ్బు అయిపోవడంతో భవన నిర్మాణం పని సగంలోనే ఆగిపోయింది.  జరుగుతున్న సంఘటనలకు విసిగిపోయి బాబాని కలుసుకోవాలనుకున్నారు.

ఆయన షిరిడీ వెళ్ళి ద్వారకామాయి మెట్లు ఎక్కగానే బాబా ఆయనవైపు చూసి గట్టిగా అరుస్తూ, చాలా చెడ్డగ తిట్లవర్షం కురిపించారు.  బాబా తిడుతున్న కొద్దీ గాడ్గే మహరాజ్ నవ్వుతూనే ఉన్నారు.  ఇక తన పని నిర్విఘ్నంగా సాగుతుందని గాడ్గే మహరాజ్ గారికి అర్ధమయింది.  బాబాతిట్లు తిట్టడం వల్ల ఆయనదురదృష్టం తొలగిపోయి డబ్బు పోగయ్యి భవన నిర్మాణం ఎటువంటి కష్టం లేకుండా పూర్తయింది

గాడ్గే మహరాజ్ తాను సమాధి చెందడానికి ముందు 1927వ.సంవత్సరంలో షిరిడీ వెళ్లారు.  “ హక్ జాతో ఆమ్ చే గావోనా” (నేను నాధామానికి చేరుకొంటున్నాను) అని స్మరించుకుంటూ షిరిడీలోని వీధులను తుడిచారు.  ఆయన బాబా సమాధిమందిరం వద్ద ప్రార్ధించి తన అనుచరులతో “మనం మరలా కలుసుకొందాము” అన్నారు.  ఆతరువాత ఆయన నర్మదా నదీ తీరానికి వెళ్ళి మహాసమాధి చెందారు.

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List